Illegal construction | కొండాపూర్, మే 13 : తెలిసిన వాళ్లే కదా.. దయ తలచి రేకుల గదులను అద్దెకిస్తే, అదును చూసి ఇంటిని కబ్జా చేశారు. దర్జాగా రేకుల గదులను కూల్చివేసి ఇంటి నిర్మాణాన్ని సైతం చేపట్టారు. ఇదేంటని ప్రశ్నించిన యజమానిని కబ్జాదారులు చితకబాదారు. ఇదంతా ఎక్కడో మారుమూల పల్లెలో లేదా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది అనుకుంటే పొరపాటే. హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో, హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రేమ్ నగర్లో కొన్నేండ్లుగా నివాసముంటున్న బాబు రావు ప్రేమ్ నగర్కు చెందిన కన్నా రావు నుంచి 1400ల గజాల స్థలాన్ని 1998లో రూ.3,50,000 పెట్టి కొనుగోలు చేశాడు. కాగా అందులో నుంచి 300ల గజాలలో ఉన్న రేకుల గదులను మహానంది సాగర్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. కొంత కాలం బాగానే ఉన్న మహానంది సాగర్, బాబు రావు పరిస్థితులను ఆసరాగా తీసుకుని అద్దె ఇవ్వడం మానేశాడు. సదరు ఇంటిని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటూ మొండిగా తయారయ్యాడు.
బాబు రావు వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సదరు కబ్జాదారుడు ఉంటున్న రేకుల గదులను కూల్చి వేసి, ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. విషయం తెలుసుకున్న బాబు రావు అడ్డుకునేందుకు వెళితే మహానంది సాగర్ కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. అటు వైపు వస్తె చంపేస్తామని బెదిరింపులకు దిగారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు, మున్సిపల్ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ కోర్టు ఆదేశాలు..
తనకు జరిగిన అన్యాయంపై బాబు రావు మున్సిపల్ అధికారులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందకపోగా.. సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని సైతం అడ్డుకోలేకపోయారు. దీని పై కోర్టుకెళ్లిన బాబు రావుకు ఊరట లభించింది. సదరు స్థలంలో కొనసాగుతున్న నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశించినప్పటికీ మున్సిపల్ (టౌన్ ప్లానింగ్) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు. న్యాయస్థానం ఆదేశాలను సైతం పట్టించుకోకపోతే మాలాంటి పేదలకు ప్రజా పాలనలో న్యాయం ఎక్కడ దొరుకుతుందంటున్నాడు. రేపు మాపు అంటూ లేనిపోని సాకులు చెబుతూ కాలం వెల్లడిస్తున్నారని, పునాదుల సమయంలో ఫిర్యాదు చేస్తే 4 అంతస్తుల నిర్మాణం అయిన కూడా స్పందన లేదంటున్నాడు. అధికారుల చుట్టూ తిరిగే ఓపిక, శక్తి తనకు లేదని, సదరు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందంటూ అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇకనైనా టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.