సిటీబ్యూరో, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): తమనెవరు పట్టుకోరు.. అనే ధీమాతో ఉన్న మాదక ద్రవ్యాల నెట్వర్క్ను ఏరివేసే ప్రక్రియను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్-నాబ్) వేగవంతం చేసింది. సినీ ఫీల్డ్తో సంబంధాలు ఉన్న పలువురు అప్పుడప్పుడు టాస్క్ఫోర్స్, ఎక్సైజ్, స్థానిక పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా.. టీఎస్ నాబ్ చేసిన దాడిలో పలు సినిమాలకు ఫైనాన్సియర్గా వ్యవహరించిన వెంకటరత్నారెడ్డి ఏడేండ్లుగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా సర్వీస్ అపార్టుమెంట్లను ఎంచుకొని.. తక్కువ మందితో పార్టీలు నిర్వహిస్తుండటంతో అంతా రహస్యంగానే జరిగిపోతోంది. టీఎస్-నాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నెట్వర్క్ను మూలాల నుంచి తొలగించేందుకు నిఘాను పటిష్టం చేసింది. ఇందులో భాగంగానే రెండేండ్లగా హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) డ్రగ్ నెట్వర్క్ను గుర్తించేందుకు బలమైన పునాదులు వేసింది. ఈ క్రమంలోనే గోవా, ముంబై, బెంగళూర్ నుంచి హైదరాబాద్కు డ్రగ్ సరఫరా చేసే విదేశీయులు, ఇతర రాష్ర్టాల వారిని గుర్తించి అరెస్టు చేశారు. అదే దూకుడును ఇప్పుడు టీఎస్- నాబ్ కొనసాగిస్తున్నది
పార్టీలలో మహిళలు కూడా..
సినీ ఫైనాన్సియర్ వెంకట్.. బాలాజీ ద్వారా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. వెంకట్ ఫైనాన్స్ చేస్తుండగా.. గోవా, బెంగళూర్, ముంబై నుంచి బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తెస్తున్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. కొన్ని సందర్భాలలో ఇద్దరు కలిసి గోవా, బెంగళూర్కు వెళ్లి పలువురు నైజీరియన్లను కూడా కలిసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. భారీ ఎత్తున డ్రగ్స్ తెచ్చి ఫామ్ హౌస్లలో కూడా పార్టీలు నిర్వహించినట్లు తెలిసింది. వెంకట్ నిర్వహించే పార్టీలకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్న వారితో పాటు కొందరు వ్యాపారులు కూడా హాజరైనట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. 18 మంది వినియోగదారుల ఆధారాలను టీఎస్నాబ్ సేకరిస్తున్నది. అందులో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇదిలాఉండగా.. వెంకట్ నిర్వహించే పార్టీలలో పలువురు మహిళలు కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే, వారిలో కొందరిని సినీమాలో చాన్స్లు ఇప్పిస్తానంటూ నమ్మించి ఈ పార్టీలకు వెంకట్ రప్పిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్వీస్ అపార్టుమెంట్లలో కలిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండవనే భావనతోనే వెంకట్, బాలాజీ ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాదాపూర్లో డ్రగ్ పార్టీ నిర్వహించిన అపార్టుమెంట్లోని ఫ్లాట్కు నెలకు రూ. 60వేల అద్దె చెల్లిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
గతాన్ని ఆరా తీస్తున్న టీఎస్ నాబ్
బాలాజీ గతంలో డ్రగ్స్కు సంబంధించిన కేసుల్లో అరెస్టయినట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. దీంతో, బాలాజీ, వెంకట్ మధ్య ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి.. వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారు.. అందులో డ్రగ్స్ దందాకు సంబంధించిన వారెవరు.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వైజాక్కు చెందిన బాలాజీ, గుంటూరుకు చెందిన వెంకట్ తరచూ హైదరాబాద్కు వచ్చి మాదాపూర్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేశారా.? హోటల్స్, పబ్లతో వీళ్లకు సంబంధాలున్నాయా.? అనే విషయాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.