హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్(RTC MD Sajjanar) హెచ్చరించారు. నిందితులపై పోలీస్ శాఖ సహకారంతో తెరుస్తామని స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవర్ దారవత్ గణేశ్(Driver Ganesh) ను సజ్జనర్ శనివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు.
గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. డ్రైవర్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అప్జల్ గంజ్ నుంచి ఘట్కేసర్కు వెళ్తున్న రూట్ నంబర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్ గణేశ్పై ఉస్మానియా యూనివర్శిటీ వై జంక్షన్ వద్ద దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు.
ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్ను అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆరుగురు తీవ్రంగా కొట్టారు. డ్రైవర్ గణేష్ కు తీవ్ర గాయలవడంతో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆయనను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు.
దాడికి పాల్పడ్డ ఐదుగురు దుండగులను శనివారం అరెస్ట్ చేశారని వీసీ తెలిపారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమన్నారు. డ్రైవర్ను పరామర్శించిన వారిలో జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి తదితరులున్నారు.