హైదరాబాద్ : చెరువుల ఆక్రమణ పేరుతో కూకట్పల్లి ( Kukatpalli ) లో పేదల ఇండ్లను కూల్చి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు నష్టపరిహరం చెల్లించకపోతే ముఖ్యమంత్రి నల్లచెరువు ( Nalla Cheruvu ) ప్రారంభాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్ నాయకుడు పాటిమీది జగన్ ( Patimeedi Jagan ) హెచ్చరించారు.
ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వందలాదిమంది కూకట్పల్లి గ్రామస్తుల భూములను నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇస్తామని నమ్మబలికి హైడ్రా రంగనాథ్ మోసం చేశారని ఆరోపించారు. వెంటనే కంపెన్సేషన్ టీడీఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల కూకట్పల్లికి చెందిన 52 సంవత్సరాల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని బుచ్చమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80శాతం నల్లచెరువు అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, ఓపెన్ ఎయిర్ జిమ్, పార్క్ నిర్మాణం , ఆటస్థలం నిర్మాణాలు జరిగాయని అన్నారు. కొన్ని మెరుగులు దిద్ది పూర్తి అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఊదరగొడుతున్నారని పేర్కొన్నారు.
దుర్గం చెరువు, మల్కం చెరువు, ఐడీఎల్ లేక్ ఫ్రంట్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో చేసినప్పుడు ఒక్క ఇల్లు కూల్చలేదని, ఎవరి భూములు లాక్కోలేదని ఆయన వెల్లడించారు.