కందుకూరు, జూన్ 19: ఏడో విడుత హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చాలని, ప్రతి ఒక్కరూ హరిత తెలం గాణకు అడుగులు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ఎంపీపీ, ఎంపీటీసీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొలకరి వర్షాలు పడగానే రాష్ట్ర ప్రభుత్వం ఏడో విడుత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తుందని, అందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనాల మాదిరిగా మండలంలో నాలుగు ఎకరాల్లో మండల పకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని అందుకోసం అధికారులు కృషి చేయాలని సూచించారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటాలని కోరారు. రోడ్ల వెడల్పును దృష్టిలో పెట్టుకొని మొక్కలను నాటాలన్నారు. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు మొదలు కొని సర్పంచ్ల వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. హరితహారం ప్రారంభించిన నాటి నుంచి అడవుల శాతం పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి ఎంపీపీ జ్యోతి పాండు, ఇన్చార్జి ఎంపీడీఓ విజయలక్ష్మి వివిధ గ్రామాల ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.