సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) / మణికొండ : నగర శివారు ఐటీ కారిడార్లో అందుబాటులోకి వచ్చిన అర్బన్ ఫారెస్ట్ పార్కు పక్షి ప్రియులకు కేంద్రంగా మారింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మంచిరేవులలో 250 ఎకరాల్లో కొత్తగా అభివృద్ధి చేసిన అటవీ పార్కులో ఆదివారం మొట్ట మొదటి సారిగా పక్షులను గుర్తించేందుకు బర్డ్ వాక్ నిర్వహించారు. తెలంగాణ అటవీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎకోటూరిజం స్కైలాబ్ ఆధ్వర్యంలో 30మంది సభ్యులతో కూడిన బృందం ఉదయం 6:30 గంటల నుంచి అటవీ ప్రాంతమంతా కలియతిరుగుతూ తమ అత్యాధునిక కెమెరాల్లో వివిధ రకాల పక్షులకు బంధించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ మేనేజర్లు మధుసూదన్, లక్ష్మారెడ్డి, ఎకో మేనేజర్ కల్యాణపు సుమన్, సూపర్వైజర్ శ్రీకాంత్, బర్డింగ్ పాల్స్ ప్రతినిధులు కళ్యాణ్, విజయ్, స్వాతి, పక్షి ప్రియులు పాల్గొన్నారు.
30 రకాల పక్షులను గుర్తింపు
మొట్ట మొదటిసారిగా నిర్వహించిన బర్డ్ వాక్లో సుమారు 30 రకాల పక్షులను గుర్తించారు. ఇందులో బ్లూ పేస్డ్ మల్కోవా, కాపర్ స్మిత్ బార్బేట్, కామన్ అయోరా, ఏషియన్ కోయల్, రోఫస్ ట్రీఫె, బ్లాక్ డోంగ్రో, లిటిల్ గ్రెబ్స్, వుడ్ సాండ్ పైపర్, ఆఫిక్రా వంటి పక్షులను గుర్తించారు.