కేపీహెచ్బీ కాలనీ, జనవరి 2 : హైదరాబాద్ మహానగరంలో వివిధ ప్రాంతాలు, రాష్ర్టాలు, దేశాల నుంచి వలసలు వచ్చిన లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అనే తేడాలేకుండా రోడ్లపై భిక్షాటన చేస్తూ వచ్చిన ఆహారం, డబ్బులతో తిండితింటూ రోడ్లపైనే నిద్రిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్లు, దేవాలయాల ప్రాంగణాలలో కాలం గడుపుతూ జీవిస్తున్న వారికి ఆశ్రయం కల్పించే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. ఏ ఆసరా లేకుండా దిక్కూమొక్కూ లేని అనాథలను, భిక్షాటన చేస్తున్నవారిని గుర్తించి జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్కు తరలించి ఆశ్రయం కల్పించేలా కృషి చేస్తున్నారు. మహానగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
గుర్తింపునకు ప్రత్యేక సర్వే..
కూకట్పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలో నిరాశ్రయులు, భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో సర్వేను చేపట్టారు. వారంలో రెండురోజులు రాత్రి వేళలో కాలనీలు, బస్తీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్లు, దేవాలయాల వద్ద సర్వేను చేపట్టి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు జంట సర్కిళ్లలో నిరాశ్రయులు 37 మంది ఉండగా మూసాపేట సర్కిల్లో 22 మంది, కూకట్పల్లి సర్కిల్లో 15 మంది ఉన్నట్లు గుర్తించారు. రోడ్లపై నిద్రిస్తూ భిక్షాటన చేస్తున్న వారి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి నగరంలోని ప్రధాన చౌరస్తాలకు చేరుకుని కేవలం భిక్షాటన చేసి తర్వాత వారి ఇండ్లకు వెళ్తున్నట్లు తెలిసింది. కొందరు మానసిక ఇబ్బందులతో రోడ్లపైనే జీవిస్తున్నట్లు తేలింది. కొందిమంది పిల్లలు కుటుంబం ఉన్నప్పటికీ భిక్షాటనకు అలవాటు పడి రోడ్లపై భిక్షటన చేస్తున్నట్లు తెలుస్తుంది. కుటుంబాల కలహాల కారణంగా కొద్దిమంది ఇల్లు విడిచి రోడ్లపై జీవనానికి అలవాటు పడ్డట్లు సర్వేలో తేలింది. ఇలాంటి వారందరికీ భిక్షాటన, రోడ్లపై జీవించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వారందరినీ నైట్ షెల్టర్ హోమ్కు తరలించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
నిరాశ్రయులకు ఆశ్రయం..
ఏ ఆధారం లేకుండా రోడ్లపై నివసిస్తున్న అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిళ్ల పరిధిలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాల వద్ద రాత్రి వేళలో పడుకుంటున్న వారిని గుర్తిస్తూ వారి వివరాలను సేకరిస్తున్నాం. కుటుంబాలులేని నిరాశ్రయులను ఆదుకుని అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నాం. కొందరు అన్నీ ఉన్నా అలవాటుగా రోడ్లపై భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించాం. వీరికి అవగాహన కల్పించి మరోసారి రోడ్లపై భిక్షాటన చేయొద్దని సూచిస్తున్నాం. ప్రతి మంగళ, శుక్రవారం రాత్రి వేళల్లో సర్వేచేసి నిరాశ్రయులను గుర్తిస్తున్నాం. బాధితులను జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్కు తరలించేలా చర్యలు చేపడుతున్నాం.
– కె.ప్రభాకర్, డీపీవో, మూసాపేట సర్కిల్