సిటీబ్యూరో/బేగంపేట్, మే 28 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో శనివారం ఐటీ అధికారుల ముసుగులో 1700 గ్రాముల బంగారం దోపిడీ చేసిన ముఠా ఆచూకీ కోసం ఉత్తర మండలం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దారిపొడువున ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం 11:30 గంటలకు పాట్ మార్కెట్లోని బాలాజీ బంగారు దుకాణంలోకి ఐటీ అధికారుల పేరుతో వచ్చిన నేరగాళ్లు.. బంగారం దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఉత్తర మండలం పోలీసులు.. బాలాజీ నగల దుకాణం నుంచి మొదలు నిందితులు పారిపోయిన మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలను ఆదివారం మార్కెట్ పోలీసులు పరిశీలించారు. దీంతో నిందితులు కూకట్పల్లి మీదుగా మహారాష్ట్ర పారిపోయినట్టు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
పనివాళ్లను విచారిస్తున్న పోలీసులు..
బాలాజీ బంగారు నగల దుకాణం యజమాని మహారాష్ట్రకు చెందిన వారని, ఆ దుకాణంలో పనిచేసే కార్మికులు కూడా మహారాష్ట్రకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం మేరకు నేరస్తులు కూడా మహారాష్ట్రకు చెందిన వారుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాల్లోని ఓ టీమ్ నగల దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విచారిస్తున్నది. సిబ్బంది ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారుల పేరుతో వచ్చిన నేరగాళ్లు.. వచ్చిన ఐదు నిమిషాల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో నగలు దోచుకొని పారిపోయారు. దోపిడీ గ్యాంగులో దుకాణం గురించి తెలిసిన వారు ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగో అంతస్తులో ఉన్న బాలాజీ నగల కార్ఖానాలోకి నడుచుకుంటూ వెళ్లిన నిందితులు.. దోపిడీ పూర్తయిన తర్వాత తిరిగి నడుచుకుంటూ కిందికి వెళ్లిపోయారని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పోలీసుల విచారణలో తెలిపారు. సిబ్బంది ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది పక్కా ప్లాన్తోనే జరిగిన నేరమని, బాగా తెలిసిన వారే ఈ నేరంలో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను తప్పకుండా పట్టుకుంటామని చెబుతున్నారు. హైదరాబాద్లో కొన్ని టీమ్లు పనిచేస్తున్నాయి, మహారాష్ట్రకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లాయని ఏసీపీ రమేశ్ తెలిపారు.
సికింద్రాబాద్ ఘటనతో అప్రమత్తం..
అంతర్రాష్ట్ర ముఠాలు తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సికింద్రాబాద్లో గ్యాంగ్ సినిమా తరహాలో ఐటీ అధికారుల పేరుతో జరిగిన బంగారం షాపులోని దోపిడీ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోకి అంతర్రాష్ట్ర ముఠాలు ప్రవేశించాయని, అందులో ఒక గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మహారాష్ర్టాకు చెందిన గ్యాంగ్గా అనుమానిస్తూ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దృష్టి మళ్లించి దొంగతనాలు చేయడం, పోలీసు, ఐటీ అధికారుల ముసుగులో దొంగతనాలకు పాల్పడే గ్యాంగులు.. ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పాత గ్యాంగుల జాబితాను పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ర్టాల పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నారు.
హైదరాబాద్ అంటేనే భయం..
నగరంలో ఉన్న సీసీ కెమెరాలు ఏ మూలన నేరం జరిగినా, ఆ దొంగలను ఇట్టే పట్టేస్తున్నాయి. సికింద్రాబాద్ దోపిడీ ఘటనను కూడా ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, మరోసారి అంతర్రాష్ట్ర ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు అన్ని రకాల చర్యలు మొదలుపెట్టారు.