చారిత్రక హైదరాబాద్లో సరికొత్త చరిత్ర నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో దశాబ్దిలోనే శతాబ్ది పాటు గుర్తుండేలా అద్భుత కట్టడాలు, ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న ఈ మహానగరం ప్రతిష్టను ఈ ఐకానిక్ నిర్మాణాలు విశ్వవ్యాప్తం చేశాయి. తెలంగాణ వైభవం ఉట్టి పడేలా ఉన్న నిర్మాణాలను చూసి దేశమే విస్తుపోతున్నది. నగరం నడిబొడ్డున ఉన్న సాగరతీరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ పాలనాదక్షతకు నిదర్శనంగా నిలిచిన పాలనాసౌధం.. ఆ ఎదురుగానే అమరుల త్యాగాల యాదిలో స్మృతి మందిరం, ఆ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. మరో వైపు దేశంలోనే అరుదైన నిర్మాణంగా నిలిచిన కేబుల్ బ్రిడ్జి.. అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టార్టప్లకు పురుడు పోసే టీహబ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే నిర్మాణాలు ఎన్నో. నగర కీర్తి కిరీటంలో కలికితురాయిలు నిలిచిపోయే నిర్మాణాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆరే కర్త.. కర్మ.. క్రియ కావడం విశేషం.
– సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ)
గుర్తుండిపోయేలా ఐకానిక్ స్ట్రక్చర్స్
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కొత్త అందాలతో శోభిల్లుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో దశాబ్దిలో శతాబ్ది పాటు గుర్తుండేలా అద్భుత కట్టడాలు, చారిత్రాత్మక ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో ఈ ఐకానిక్ నిర్మాణాలు నగర ప్రతిష్టను మరింత పెంచాయి. తెలంగాణ వైభవం ఉట్టి పడేలా, గొప్పదనాన్ని చాటేలా నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా హుస్సేన్సాగర్ తీరం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ నగర సందర్శనకు వచ్చే వారికి చిరస్థాయిలో గుర్తుండిపోయేలా ఐకానిక్ స్ట్రక్చర్స్గా నిలుస్తున్నాయి. ఇప్పటికే 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం రికార్డు సాధించింది. 26.98 ఎకరాల్లో నిర్మించిన నూతన సచివాలయం ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. మొత్తంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున నగర కీర్తి కిరీటంలో ఈ నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోవడమే కాదు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి.
హుస్సేన్సాగర్ తీరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం సగర్వంగా కొలువుదీరింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరు దక్కించుకుంది. ఈ విగ్రహం బరువు 465 టన్నులు. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహం తయారీకి 425 మంది శ్రామికులు పనిచేశారు. ఇందులో 15 మంది సామర్థ్యంతో 2 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటుకు 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు 1.35 ఎకరాలు, చుట్టూ పచ్చదనంకు 2.93 ఎకరాలు, 1.23 ఎకరాల్లో అభివృద్ధి, 4.82 ఎకరాల్లో కామన్ పార్కింగ్కు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు. ఈ విగ్రహం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన సీసీసీ
హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్విన్ టవర్స్ నిర్మాణం జరిగింది. ట్విన్ టవర్స్లో ఒకటి పూర్తిగా టెక్నాలజీతో కూడుకున్నదే. మరొకటి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం. ఈ రెండు టవర్స్ మధ్య సుమారు 40 వేల చదరపు అడుగులతో అత్యాధునిక టెక్నాలజీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2015 నవంబరు 22వ తేదీన బంజారాహిల్స్ రోడ్డు నెం.12లో పోలీసు శాఖ స్థలంలో ట్విన్ టవర్స్కు శంకుస్థాపన చేశారు. ట్విన్ టవర్స్ నిర్మాణాలు, అందుకు కావాల్సిన టెక్నాలజీ నెట్ వర్క్ మొత్తానికి ప్రభుత్వం వెయ్యి కోట్లు వెచ్చించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 40 వేల సీసీ కెమెరాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేశారు. ఈ ట్విన్టవర్స్ అంతర్జాతీయ గుర్తింపు పొంది, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మరింతగా పెంచింది.
సచివాలయ డిజైన్కు ప్రేరణ.. నీలకంఠేశ్వరస్వామి దేవాలయం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం దేశంలోనే ఓ అరుదైన అద్భుత నిర్మాణంగా పేరుగాంచింది. కాకతీయ నిర్మాణ శైలిలో అడుగడుగునా అదరహో అనిపించేలా నిర్మితమైనది. షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన సచివాలయాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించింది. సచివాలయ డిజైన్కు ప్రేరణ నిజామాబాద్లోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రసాదాల్లోని శైలులు-అకడి గోపురాలు, గుజరాత్లోని సారంగాపూర్లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలో 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మించబడింది.
అమరుల స్ఫూర్తిని భావి తరాలకు తెలిపేలా.. స్మృతి మందిరం
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల స్ఫూర్తిని భావి తరాలకు తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్సాగర్ సమీపంలో దాదాపు రూ.179 కోట్ల వ్యయంతో భారీ స్మారక మందిరాన్ని నిర్మించింది. ప్రత్యేకంగా దుబాయ్ నుంచి 316 ఎల్ గ్రేడ్ రకం స్టెయిన్లెస్ స్టీల్ను కాంట్రాక్ట్ సంస్థ నుంచి తెప్పించుకున్నది. సుమారు 150 మీటర్ల చుట్టు కొలతతో ఉండే మొత్తం కట్టడానికి ఈ స్టీల్నే బయట వైపు వాడారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా తుప్పు పట్టడానికి అస్కారం ఉండదు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రక్చర్గా ఈ నిర్మాణం రికార్డు సృష్టించనున్నది. కట్టడం రూఫ్ పైన ఉండే జ్యోతి (దీపం) 20 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అమరవీరుల స్మారక మందిరంలోని తొలి అంతస్తులో సుమారు 25వేల చ. అ. విస్తీర్ణంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం రూపుదిద్దుకున్నది.
స్టార్టప్లకు ఇంక్యుబేటర్గా టీ-హబ్
ఆలోచనతో రండి… ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్లకు ఇంక్యుబేటర్గా టీ-హబ్ ఏర్పాటైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో సుమారు 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ భవనాన్ని నిర్మించారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.10 కోట్లు కేటాయించింది. స్టార్టప్ ఎకో సిస్టిం (అనుకూల వాతావరణం)ను అభివృద్ధి చేయడంతో మొదట్లో 400గా ఉన్న స్టార్టప్ల సంఖ్య ప్రస్తుతం 2000 వరకు పెంచారు. టీ హబ్లో ఇప్పటి వరకు 1800 స్టార్టప్లకు సహాయ సహకారాలు అందాయి. మరిన్ని స్టార్టప్లకు అవకాశం ఇచ్చేందుకు టీ హబ్ 2ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. టీహబ్ 2 ప్రారంభమైతే ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రంగా టీ హబ్ మారనున్నది.
జర్మన్ టెక్నాలజీతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
హైదరాబాద్లో పేరున్న కట్టడాల జాబితాలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి ప్రత్యేక స్థానం ఉన్నది. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45ను మాదాపూర్తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు ఫిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మన్ టెక్నాలజీతో 8 దేశాల ఇంజినీర్లు 22 నెలల పాటు శ్రమించి దీన్ని నిర్మించారు. దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైనది. ఒక్కో ఫైలాన్కు 26 దృఢమైన ఐరన్ కేబుళ్లు వాడారు. ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యంగా ఉండేలా దూరాన్ని తగ్గించేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.
ప్రపంచంలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టి పూర్తి చేసిన అతి పెద్ద ప్రాజెక్టు ఇది. 69 కి.మీ మేర నిర్మించిన మెట్రో ప్రాజెక్టులో 2600 పిల్లర్లు ఉంటే, ప్రతి పిల్లరు నిర్మాణంలో ఒక ప్రత్యేక అనుభవాన్ని నేర్పిందని దాని నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ప్రతి రోజు 4లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ మెట్రో కింద రాయిదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31 కి.మీల మేరలో చేపడుతున్నారు. అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా టోలిచౌకి, మెహిదీపట్నం, లక్డీకాపూల్ వరకు 26 కి.మీ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మరో 5 కి.మీ దూరం కలిపి మొత్తం మరో 62 కి.మీ మేర విస్తరించేందుకు డీపీఆర్లను సైతం తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది.
అద్భుతంగా ఆకాశ వంతెనలు..
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరం అద్భుత నిర్మాణాలకు నిలయాలుగా మారుతున్నది. ఇప్పటికే హైదరాబాద్ సిగలోకి ఫ్లై ఓవర్ల మీదుగా వెళ్తున్న మెట్రో నిర్మాణం చెరగని ముద్ర వేసుకోగా.. అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ జాబితాలోకి హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మక దారుల పథకం ఎస్ఆర్డీపీ చేరింది. మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాల్లో నాలుగు ఫ్లై ఓవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉప్పల్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ల మీదుగా చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు నిర్మాణాల్లోనే అద్భుతంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది చివరలో ఉప్పల్, వచ్చే నెలలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయి.
నీటి ఎద్దడిని తీర్చిన భగీరథ ప్రయత్నం
2015 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూర్, మంజీరా, నగరంలోని జంట జలాశయాల్లోని నీటి నిల్వలు అడుగంటి పోయాయి. సుమారుగా 170 ఎంజీడీల నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే భగీరథ ప్రయత్నంగా కృష్ణా మూడో దశ ద్వారా 90 ఎంజీడీలు, గోదావరి తొలి విడత పథకం ద్వారా 100 ఎంజీడీల మేర పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి నిర్ణీత సమయంలో ఈ రెండు పథకాల ద్వారా దాహార్తిని తీర్చింది. ముఖ్యంగా గోదావరి పథకం పనుల్లో భాగంగా రక్షణ, ఆటవీ, రైల్వే శాఖల అనుమతుల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టింది. రైల్వే శాఖ అనుమతుల విషయంలో సీఎం తనదైన శైలిలో స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. గోదావరి తొలి విడత పథకాన్ని పూర్తి చేసి రోజూ 172 ఎంజీడీల మేర నీటిని డిసెంబరు 2015 నుంచి తరలిస్తూ వస్తున్నారు. ఇక కృష్ణా మూడో దశ జలాలను జవనరి 2015 నుంచి అదనంగా 90 ఎంజీడీల నీటిని తరలించి నీటి ఎద్దడి లేకుండా చేశారు. రూ.3725 కోట్లతో గోదావరి తొలి విడత, రూ. 1670 కోట్లు కృష్ణా మూడవ దశ పథకాలకు ఖర్చు చేశారు.
సుంకిశాలతో వందేళ్ల భరోసా
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నది. ఇప్పటికే వివిధ దశల్లో కృష్ణా, గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా జరుగుతుంది. గోదావరి నీటి కోసం కొండపోచమ్మ సాగర్ వద్ద కేశవాపూర్ రిజర్వాయర్, కృష్ణా నీటి కోసం సుంకిశాల ప్రాజెక్టులు చేపడుతున్నది. రూ.1450 కోట్ల వ్యయం తో సుంకిశాల ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించగా.. నగరానికి వరుసగా అయిదేళ్లు కరవు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజీ ఉన్నా.. దీని ద్వారా ప్రజలకు తాగునీరు అందిం చే వీలుంటుంది. మొత్తం ప్రాజెక్టును 2023 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకడి నుంచి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు.