Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 18 : తాను ఇష్టపడుతున్న యువతిని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే మానుకోవాలంటూ హెచ్చరించడం ఇరువర్గాల మధ్యన గొడవకు దారితీసింది. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇస్లామ్ అనే యువకుడికి ఇటీవల ఓ యువతితో పెళ్లి కుదిరింది. కాగా నౌషాద్ అనే వ్యక్తి పలుమార్లు ఇస్లామ్కు, అతడి సోదరుడు నిజాం అలీకి ఫోన్లు చేస్తూ తాను ఇష్టపడుతున్న యువతిని పెళ్లి చేసుకోవద్దని, పెళ్లిని రద్దు చేసుకోవాలంటూ హెచ్చరిస్తున్నాడు. తనవద్దకు వస్తే మరిన్ని విషయాలు చెబుతానంటూ అల్కాపూర్కు రావాలని సూచించాడు.
దీంతో శుక్రవారం సాయంత్రం ఇస్లామ్ అక్కడకు వెళ్లగా నౌషాద్తో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోతే నీ సంగతి చూస్తా అంటూ నౌషాద్ బెదిరించారు. కాగా సాయంత్రం ఇదే విషయం గురించి ఓయూ కాలనీలోని సెలూన్లో పనిచేస్తున్న సోదరుడు నిజాం అలీకి చెప్పాడు. దీంతో నిజాం అలీ, నాజిమ్లు సెలూన్ ముందు నిలబడి మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన నౌషాద్, షాదాబ్, అఫ్జల్తో పాటు మరికొంతమంది వారిద్దరిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు నిజాం అలీ ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.