కుత్బుల్లాపూర్, నవంబర్18: జీఎస్టీ కస్టమ్స్ శాఖ అధికారులమంటూ ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్న ముఠాలోని ఇద్దరిని శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్కు చెందిన నారాయణగౌడ్ గత కొన్నేండ్లుగా లక్డీకాపూల్లోని జీఎస్టీ కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో తన ఐదు వాహనాలను అద్దెకు (టెండర్ ద్వారా) పెట్టాడు. ఆ కార్లకు జీఎస్టీ కస్టమ్స్ కార్యాలయం స్టిక్కర్లను అతికించారు. ఆ కార్లలో తిరుగుతున్న నారాయణగౌడ్ను చూసిన ప్రజలు జీఎస్టీ కస్టమ్స్ అధికారిగా నమ్మారు.
అతడు కూడా తాను జీఎస్టీ కస్టమ్స్ అధికారినంటూ పరిచయం పెంచుకున్నాడు. కొంతమంది ఉన్నతాధికారులతో కూడా పరిచయాలు పెంచుకున్నాడు. ఈ పరిచయాలతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఔట్ సోర్సింగ్ ద్వారా కొందరికి ఉద్యోగాల్లో పెట్టించాడు. బడా వ్యాపారులు, బిల్డర్లతో ఏర్పడిన పరిచయాలను తన వ్యాపారాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. నారాయణగౌడ్ వ్యవహారం సాఫీగా సాగేందుకు ఓ గ్యాంగ్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ గ్యాంగ్లో కాప్రా నివాసి శైలజను చేర్చుకొని, ఆమెను జీఎస్టీ కస్టమ్స్ కమిషనర్గా, విజయ్, రాజు, చరణ్ను చేర్చుకొని తన సిబ్బందిగా పరిచయం చేస్తూ.. మోసాలు చేయడం మొదలుపెట్టాడు.
తెలిసిన వారి ద్వారా గజ్వేల్కు చెందిన సిమెంట్ అండ్ స్టీల్ వ్యాపారాలు ఎ.కిషన్కుమార్, నేతి శ్రీనివాస్ను పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్నట్లు నమ్మించి స్టీల్, సిమెంట్ కావాలని కోరాడు. జీఎస్టీ, ఇతర చార్జీలను తగ్గించి, లాభాలు వచ్చేలా సహాయం చేస్తానని చెప్పాడు. హైదరాబాద్కు చెందిన బిల్డర్లు బీకే ఎంటర్ప్రైజెస్, ఆర్ఏ ట్రేడర్స్ అండ్ మార్కెటింగ్, రిసినియా ఇన్ఫ్రా డెవలపర్స్తో కూడా పరిచయం పెంచుకున్నాడు. వ్యాపారం నేపథ్యంలో బిల్డర్లు, సిమెంట్ వ్యాపారుల మధ్య నారాయణగౌడ్ మధ్యవర్తిగా ఉంటూ.. బిల్డర్లకు అవసరమైన నిర్మాణ సామగ్రిని ఇప్పించాడు. బిల్డర్లు కూడా సామగ్రికి సంబంధించిన బిల్లులను నారాయణగౌడ్కు చెల్లించారు.
నారాయణగౌడ్ మాత్రం వ్యాపారులకు పూర్తిగా డబ్బులు చెల్లించకుండా.. కొంత డబ్బు నొక్కేశాడు. దీంతో వ్యాపారులకు రూ.80 లక్షల వరకు బాకీ పడ్డాడు. అంతేకాదు.. బంగారం ఉన్నదని, గ్రాముకు 5 వేలు తక్కువగా ఇప్పిస్తానని చెప్పి, డబ్బు వసూలు చేశాడు. వ్యాపారుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దఫ దఫాలుగా బాధితుల నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. నారాయణగౌడ్ వ్యవహారంపై బాధితులకు అనుమానం వచ్చింది. లక్డీకాపూల్లోని జీఎస్టీ కస్టమ్స్ ప్రధాన కార్యాలయాన్ని బాధితులు సందర్శించి ఆరా తీయగా.. అతడు అధికారి కాదని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొంపల్లిలోని బ్రిడ్జి సమీపంలో వ్యాపారులు, నిందితుల మధ్య నగదు బదిలీలు జరిగాయి. దీంతో బాధితులు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నారాయణగౌడ్, శైలజ పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నారాయణగౌడ్పై వేర్వేరు పోలీసు స్టేషన్లలో 12 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది.