సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం. దాన్ని సాకారం చేసే దిశగా హెచ్ఎండీఏ అధికారులు అడుగులు వేస్తున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమాన్ నుంచి ప్రతాపసింగారం వరకు రోడ్డు విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపడుతున్నది. రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా ఉన్న 122 చెట్లను తొలగించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.
ఈ మేరకు వాటిని ట్రాన్స్లొకేషన్లో తొలగించి పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు హెచ్ఎండీఏ అధికారులు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి మల్కాజిగిరి జిల్లా అటవీశాఖ అధికారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడంతోపాటు ట్రీ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. కమిటీ ఆమోదం పొందిన తదుపరి ట్రాన్స్లొకేషన్ పద్ధతికి శ్రీకారం చుట్టారు.
ప్రణాళికాబద్ధంగా చుట్టూ గుంతలు తీసి జేసీబీ సహాయంతో వేళ్లతో సహా భారీ వాహనాల్లోకి ఎక్కించి ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ట్రాన్స్లొకేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 90కి పైగా చెట్లను అక్కడకు తరలించి హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం పరిరక్షణ చర్యలు మొదలుపెట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చెట్లను నరికివేయాల్సి వస్తే..వాటికి ప్రత్యామ్నాయంగా నూతనంగా మొక్కలు నాటుతామని, కొన్ని చోట్ల చెట్లను తొలగించకుండా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.