మేడ్చల్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో శుక్రవారం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్ సమక్షంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ(డీఐపీసీ) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు తోడుగా మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ నిబంధనల మేరకు టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల మంజూరుతోపాటు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలకు వీలైనంత త్వరగా అనుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, దీని వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న దృష్ట్యా అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అనుమతులకు సంబంధించి పురోగతిని జిల్లా పరిశ్రమల అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు.
పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ కింద ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.1,20,225 అందిస్తుందని, ఎస్టీ పారిశ్రామికవేత్తలైన 12 మందికి రూ.31,63,665 పెట్టుబడి రాయితీలను మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ పరిశ్రమలు ప్రారంభమైన వెంటనే పెట్టుబడి రాయితీలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులు పాల్గొన్నారు.
శామీర్పేట, నవంబర్ 18 : వృత్తి శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్ టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య అధిగమించేలా యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ద్వారా వృత్తి శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కోర్సులను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి
దిశగా ఎదగాలన్నారు. కోర్సులు నేర్చుకోవడానికి వచ్చే వారికి బస్సు సౌకర్యం కోసం రిక్వెస్ట్ బస్టాప్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బలరామారావు, మున్సిపల్ కమిషనర్ జేతూరామ్, సెంటర్ ఇన్చార్జి జానకిరాములు, ఫ్యాకల్టీస్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.