హైదరాబాద్: ఆకలిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న హైదరాబాదీ అజార్ మక్సూసీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూకే అవార్డు దక్కింది. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త అజార్ మక్సూసీ సాని వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా దేశంలోని ఐదు నగరాల్లో రోజూ 1500 మంది నిరుపేదల కడుపు నింపుతున్నారు. ‘ఆకలికి మతం లేదు’ అన్న ఉద్దేశంతో అజార్ ఆకలిపై యోధుడిలా పోరాడుతున్నారు. ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా ఇటీవల యునైటెడ్ కింగ్డమ్స్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును ప్రదానం చేశారు.
ఎవరైతే తమ చుట్టూ ఉన్న సమాజంలో సేవ ద్వారా అనుకూలమైన మార్పులు తేగలుగుతారో అలాంటి వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. సమాజానికి అజార్ చేస్తున్న సేవ వెలకట్టలేనిది. తిండి లేక అల్లాడుతున్న లక్షలాది మందికి ఆయన కడుపు నింపుతున్నారు. నిస్వార్థంతో నిరుపేదలకు సేవ చేసే మిషన్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. కానీ ‘ఆకలికి మతం లేదు’ అంటూ సాని వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్లు గత ఎనిమిదేళ్లుగా చేస్తున్న సేవ గొప్పది అని హైదరాబాద్లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కొనియాడారు.
భగవంతుడు తనకు పేదల కడుపు నింపే అవకాశం, శక్తిని ప్రసాదించినందుకు కృతజ్ఞడనై ఉంటానని అజార్ మక్సూసీ వ్యాఖ్యానించారు. తాను గత పదేండ్లుగా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని, ఇకపై కూడా ఆకలిని రూపుమాపే వరకు తన సేవ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా తన సేవలను గుర్తించి తనకు సహకరించిన కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా అజార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు తాను కూడా పేదవాడిని చెప్పారు.