బంజారాహిల్స్,జూన్ 24: అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ గృహిణి తన రెండున్నర ఏండ్ల కొడుకును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి చెందిన శిరీష (22) వివాహం నాలుగేండ్ల కిందట ఫిలింనగర్లోని వినాయక్నగర్ బస్తీకి చెందిన విశ్వనాథ్(32)తో జరిగింది. పెండ్లి సమయంలో రూ.8లక్షల కట్నంతో పాటు ఇతర కానుకలు ఇచ్చారు. వీరికి రెండున్నర ఏండ్ల కొడుకు మనీష్ ఉన్నాడు. విశ్వనాథ్ తల్లి బసమ్మ (56) తన కోడలు శిరీషను అదనపు కట్నం కోసం రోజూ సూటిపోటి మాటలతో చిత్రహింసలకు పాల్పడుతున్నది.
అత్త బసమ్మ పెట్టే చిత్రహింసలకు తోటు భర్త విశ్వనాథ్ కూడా తోడయ్యాడు. ప్రస్తుతం శిరీష మూడునెలల గర్భవతిగా ఉంది. శనివారం ఉదయం అత్త బసమ్మ కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేసి.. తనకు వేధింపులు ఎక్కువయ్యాయని, బతకాలని లేదంటూ కన్నీళ్ల పర్యంతమైంది. రాత్రి అత్త బసమ్మ మరోసారి కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష తన గదిలో కొడుకు మనీష్కు చీరతో ఉరేసి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్త బసమ్మ, భర్త విశ్వనాథ్ 498(ఏ), 304(బి)తో పాటు వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.