దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనున్నది. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగానే తొలి ఫలితంగా దుర్గం చెరువు ఎస్టీపీ (7 ఎంఎల్డి సామర్థ్యం) పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు 26 రోజులుగా ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ నెల 7న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఎస్టీపీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 31 ఎస్టీపీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి. విడతల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దుర్గం చెరువు ఎస్టీపీ (7 ఎంఎల్డీ సామర్థ్యం) వందశాతం పనులు పూర్తి చేసుకోవడంతో 26 రోజులుగా ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ నెల 7వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 ఎస్టీపీల్లో తొలి ఫలితం దుర్గం చెరువు కావడం, తర్వాతి దశలో కోకాపేట 15 ఎంఎల్డీ, ఆ తర్వాత మరికొన్ని ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 31 ఎస్టీపీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో వంద శాతం మురుగు నీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పత్తి అవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 25 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా నిత్యం 772 మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. 2036 సంవత్సరం వరకు భవిష్యత్తులో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో 971.50 ఎంఎల్డీల సామర్థ్యం గల 15 ఎస్టీపీలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి జీహెచ్ఎంసీ పరిధిలో వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని ఎస్టీపీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.