CRIDA | దేశంలో రైతుల స్థితిగతులపై హైదరాబాద్ కేంద్రంగా అధ్యయనం చేయనుంది. వ్యవసాయం, సాగు విధానాలు, పర్యావరణ ప్రభావంతోపాటు, పంటనష్టం, భూసారం వంటి అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం సేకరించేందుకు సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంస్థ(సీఆర్ఐడీఏ) కసరత్తు చేస్తున్నది. దీనికోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించి వివరాలు సేకరించనున్నారు. దీని ద్వారా భవిష్యత్ సాగు ప్రణాళికలను మరింత పటిష్టంగా చేసుకునే వీలు ఉంటుంది.
దేశంలో సాగు, రైతుల స్థితిగతులపై తొలిసారిగా అధ్యయనానికి సీఆర్ఐడీఏ కృషి చేస్తున్నది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా స్థానిక జియోగ్రాఫికల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించనున్నారు. జాతీయ స్థాయిలో జరిగే సర్వేతో సాగు విధానాల రూపకల్పన, సోకుతున్న తెగుళ్లతో జరుగుతున్న పంట నష్టాన్ని మరింత ఖచ్చితత్వంతో అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుందని క్రీడా వర్గాలు వివరించాయి. దీనికి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. ఏ అమరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ యాప్ ద్వారా సేకరించిన వివరాలతో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పర్యావరణం ప్రభావం వంటి డేటాను క్రోడికరించి..సీజన్లు, భూస్వరూపం ఆధారంగా ప్రత్యేక నివేదికలను తయారు చేయనున్నారు. వీటిని భవిష్యత్తులో వచ్చే విపత్తులను కూడా అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. 7 అంశాల ప్రతిపాదికన రైతులు ఎదుర్కొనే 21 విషయాల వివరాలను సేకరించనున్నారు. రైతుల ఆరోగ్యం, పంట నష్టం ప్రభావం, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న విపత్తులు, కరువు పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, నేల స్వరూపం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉండనుంది. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై పాలసీలు రూపొందించేందుకు మరింత సులభతరంగా మారుతుందన్నారు. అదే విధంగా రైతుల ఆదాయాన్ని పెంచేలా సాగు నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేసేందుకు డేటా సాయపడేలా అధ్యయనం ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ర్టాల్లో జరిగే వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి వందకు పైగా మొబైల్ యాప్ల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో కాజు తోటలు, బర్రె పాలలో పోషకాలు, అరటి పండ్ల ఎగుమతులు, మేకల పెంపకం, పత్తి సాగు, వేరుశనగ పంటల ఉత్పత్తితోపాటు మరెన్నో అంశాలపై ఐసీఏఆర్ నిర్వహిస్తుండగా..తాజాగా సీఆర్ఐడీఏ కూడా యాప్ రూపొందించింది.