జలమండలికి కొత్తగా మేనేజర్లు వస్తున్నారు. కొద్ది రోజుల కిందట టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ద్వారా ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)లుగా నియామకమైన సుమారు 93 మందికి గురువారం మంత్రి కేటీఆర్ జలమండలి కార్యాలయంలో నియామక పత్రాలను అందించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జలమండలి పరిధిలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులన్నీ దాదాపుగా ఈ నియామకాలతో భర్తీ అవుతాయని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. ఏకకాలంలో సుమారు 93 మంది ఉద్యోగులను నియామకం జరుగడం వల్ల జలమండలి పరిధిలో ప్రభుత్వ పథకాల అమల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఉచిత నీటి సరఫరా, ఔటర్ చుట్టూ కృష్ణ, గోదావరి లైన్ల కోసం ప్రత్యేక గ్రిడ్ పనుల్లో వేగం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.