Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన బేగంపేట వద్ద బుధవారం ఉదయం జరిగింది.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే అతను కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న నార్త్ జోన్ ఏసీపీ పీ మధుసూదన్ రావు.. కుప్పకూలిన వ్యక్తిని గమనించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ వ్యక్తికి ఏసీపీ మధుసూదన్ రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. స్పృహలోకి వచ్చిన అతన్ని అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కు తరలించారు. బాధిత వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.