సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: కంప్యూటర్లో డిజైన్ చేసిన ఆకృతిని భౌతిక వస్తువుగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అరచేతిలో ఇమిడే వస్తువు నుంచి మొదలుకొని ఏకంగా ఒక అంతస్థు సైజులో ఉండే ఇంటిని సైతం ప్రింటింగ్ చేసి పెడుతుంది. అదే 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేలా 3డీ టెక్నాలజీ ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులతో రకరకాల పరిశ్రమలను దోహదం చేయనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కంప్యూటర్ నుంచి ప్రింటర్ ద్వారా పేపర్లు ప్రింటింగ్ చేస్తున్నంత సులభంగా 3డీ టెక్నాలజీతో నచ్చిన ఆకృతిలో భౌతిక వస్తువులను తయారు చేసుకునే అవకాశం ఈ టెక్నాలజీతో సాధ్యమవుతుంది.
అలాంటి టెక్నాలజీతో రూపొందించిన వందలాది ఉత్పత్తుల భౌతిక నమూనాలను ఆయా కంపెనీలు హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఏఎంటెక్ ఎక్స్పోలో ప్రదర్శించారు. సుమారు 70కి పైగా ప్రదర్శనదారులు 150కి పైగా ఉన్న బ్రాండ్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్లో మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రకరకాల పరిశ్రమలకు చెందిన నిపుణులు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ నమూనాలను వీక్షించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, తదితరులు
కంకర నుంచి పౌడర్ తయారీ
చిన్న కంకర రాళ్ల నుంచి 3డీ ప్రింటింగ్లో ఉపయోగించే పౌడర్ను సైతం టెక్ 15 యంత్రం ద్వారా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. యంత్రంలో 60ఎంఎం కంకర రాళ్లను వేసి 10వేల డిగ్రీల ఉష్ణోగ్రత (ప్లాస్మా)ను వినియోగించి దశల వారీగా ప్రక్రియలు జరిపి ప్రింటింగ్ పౌడర్ను అందిస్తుంది. భవిష్యత్తు అంతా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీదే. వినియోగానికి తగినట్లుగా పౌడర్ను తయారు చేసుకునేలా యంత్రం పనితీరు ఉంటుంది.
– విఘ్నేష్ నాగరాజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ మ్యాట్రిక్స్ నానో
ఖర్చులు తగ్గుతాయి
3డీ ప్రింటింగ్లో వినియోగించిన పౌడర్ను మిని షిఫ్టర్ యంత్రం ద్వారా ప్యూరిఫై చేసి మళ్లీ వినియోగించవచ్చు. దీని ద్వారా 3డీ ప్రింటింగ్ పౌడర్ ఖర్చులు చాలా వరకు ఆదా అవుతాయి. నిర్వాహకులకు ఎంతో మేలు చేకూరుతుంది.
– సయ్యద్ ఇనాముల్ హసన్, రీజినల్ సేల్స్ మేనేజర్
(కర్ణాటక), రస్సెల్ ఫీనెక్స్ సర్వీసెస్ అండ్ ఫిట్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
కొత్తగా అందుబాటులోకి వస్తున్న 3డీ టెక్నాలజీతో ఒక రంగానికే కాకుండా విభిన్న రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఎంతో నాణ్యతతో ప్రింటింగ్ చేసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీని విస్తృతంగా పరిచయం చేసేందుకు హైదరాబాద్లో మొట్ట మొదటి సారిగా 2 రోజుల పాటు ప్రదర్శనను నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం చాలా బాగుంది. వచ్చే ఏడాది సైతం ఇక్కడే ప్రదర్శనను నిర్వహించాలని నిర్ణయించాం. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ డివైజెస్ వంటి రంగాలకు అవసరమైన ఉత్పత్తులను 3డీ ప్రింటెడ్ టెక్నాలజీతో తయారు చేసుకోవచ్చు.
– ఆదిత్య చందావర్కర్, ఏఎంటెక్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు
ఎమర్జింగ్ టెక్నాలజీల్లో 3డీ ఒకటి
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను గుర్తించి, వాటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అందులో భాగంగానే ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ఏర్పాటు చేసి కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కౌడ్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ , 3డీ టెక్నాలజీ వంటి వాటిని ప్రభుత్వ శాఖల్లో వినియోగించేలా చేస్తున్నారు. ఒక్కో టెక్నాలజీ కోసం ప్రత్యేకంగా పాలసీలు, ఫ్రేమ్ వర్క్లను సైతం తీసుకువస్తున్నది. ప్రస్తుతం హైటెక్ వేదికగా ఏర్పాటు చేసిన అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనేది పూర్తిగా 3డీ ప్రింటెండ్ టెక్నాలజీ. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీకి విస్తృత అవకాశాలు ఉన్నాయి.
– రమాదేవి లంక, డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్
భవిష్యత్తులో 3డీ టెక్నాలజీ కీలకం
3డీ ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో అన్ని రంగాల్లో కీలకంగా మారుతుంది. ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హెల్త్కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, జ్యువెలరీ, ఆర్కిటెక్చర్, డిఫెన్స్, ఎరో స్పేస్ వంటి కీలక రంగాల్లో అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. గతంలో ఉన్న 2డీ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోలేని అనేక అంశాలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
– బిభు మోహపాత్ర, ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్, 3ఐడీయా టెక్నాలజీ