అమీర్పేట్, మార్చి19: తాను సేకరించిన పుస్తకాలతో 2024 చివరి నాటికి మొత్తం 25 గ్రంథాలయాలను ఏర్పా టు చేస్తానని చెబుతున్న సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బేగంపే ట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ రెండేళ్లుగా తాను సేకరించిన దాదాపు ఏడువేల పుస్తకాలతో తెలంగాణలో ఏడు, తమిళనాడులో మూడు గ్రంథాలయాలను నెలకొల్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఇటీవల జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆకర్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి అందిన పిలుపు మేరకు 18వ తేదీ ఆదివారం సాయంత్రం కోయంబత్తూరు పర్యటనలో ప్రధాని మోదీ గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఆకర్షణ సతీష్ను రెండు నిమిషాలు కలుసుకునేందుకు అవకాశమిచ్చారు. ఊహించని విధంగా ప్రధాని మోదీ, ఆకర్షణల మధ్య దాదాపు 23 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. త్వరలోనే తమిళనాడు కోయంబత్తూరు క్యాన్సర్ ఆసుపత్రి, తిరుపూరులో ఒక్కో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నానని, తెలంగాణలో 10 భరోసా సెంటర్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తానని, కొద్ది నెలల క్రితం నగరంలోని భరోసా సెంటర్లో ఒక గ్రంథాలయాన్ని అప్పటి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారని, మిగిలిన 9 సెంటర్లలో గ్రంథాలయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతూ వుమెన్స్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయెల్కు లేఖ రాసినట్లు ప్రధానికి వివరించినట్లు తెలిపారు. 25 గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్న తన సంకల్పానికి ప్రధాని మోదీ తన వంతు వితరణగా 2 వేల పుస్తకాలను బహూకరించారని తెలిపారు. 25వ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని మోదీ హామీ ఇస్తూ, తాను సంతరం చేసిన ఓ పుస్తకాన్ని అందించి ఆశీర్వదించినట్టు తెలిపారు.