సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): నగరంలో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. భూ యజమాని, బిల్డర్, మరికొంత మందితో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కుమ్మక్కై రూ. 15 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ బాధితులు సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారవేత్తలు మోతూరి శ్రీనివాస్ ప్రసాద్, మోతూరి సూర్యకమల్ ప్రసాద్, షో టైమ్ డాట్కామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండంలోని నిజాంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 326/పీలో నిడమర్తి శివప్రసాద్కు 3 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిలో ఉన్నతి బిల్డ్టెక్ సంస్థ తరపున నిర్మాణాలు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధి నవీన్కుమార్ గోయల్ ముందుకు వచ్చారు. ఈ మేరకు భూ యజమానికి 34 శాతం, బిల్డర్కు 66 శాతం ఒప్పందంతో 2016లో డెవెలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీ చేసుకున్నారు. ఈ మేరకు 2021లో హెచ్ఎండీఏ నుంచి 3 సెల్లార్లు, గ్రౌండ్, 23 అంతస్తులకు అనుమతి తెచ్చుకొని శ్రీ రథ్ అపార్టుమెంట్స్ పేరుతో నిర్మాణాలు చేపట్టారు. అనుమతులు రాక ముందే భూ యజమాని, బిల్డర్ సహకారంతో ఐదుగురికి విక్రయాలు చేశారు.
ఈ ఐదుగురితో పాటు భూ యజమాని, బిల్డర్ల వద్ద నుంచి బాధితులైన శ్రీనివాస్ప్రసాద్, సూర్యకమల్, షోటైమ్ డాట్కామ్ కంపెనీలు 97, 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లను రూ. 15.26 కోట్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విక్రయాలను దాచిపెట్టిన భూ యజమాని, బిల్డర్, బిల్డర్కు సంబంధించిన నరేంద్రకుమార్ మోడీ, శశికాంత్ మోడీలు ఇతరులకు విక్రయించారు. మొదట విక్రయించిన విషయాన్ని దాచిపెట్టి 2023లో ఒక సప్లమెంటరీ డీడ్ను నమోదు చేశారు. దీనికి అప్పటి కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ పూర్తి సహకారం అందించారని బాధితులు తెలిపారు.
ప్రణాళిక ప్రకారం మొదట విక్రయాలను దాచిపెట్టి, సబ్ రిజిస్ట్రార్ సహకారంతో అమ్మిన ఫ్లాట్లనే తిరిగి ఒక్కో ఫ్లాట్ను రూ. 22 లక్షల నుంచి రూ. 33 లక్షల ధరతో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, హర్యాన రాష్ర్టాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తున్నారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు భూ యజమాని, బిల్డర్ అతనికి సహకరించిన వారితో పాటు కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.