Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానందతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా హోటల్ ఆపరేషన్ మేనేజర్పై కూడా కేసు నమోదు చేశారు.
రాడిసన్ హోటల్లోని 1200, 1204 రూమ్లలో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆ రూమ్ల్లో డ్రగ్స్ లభించాయి. హోటల్లోనే డ్రగ్స్ లభించడంతో ఆపరేషన్ మేనేజర్పై కూడా కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీ అని తెలిసే ఆపరేషన్స్ మేనేజర్ అనుమతించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ప్రధాన నిందితుడు వివేకానంద ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్కు పెడ్లర్ మీర్జా వాహిద్ డ్రగ్స్ అందజేశాడు. స్నాప్చాట్ యాప్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ను డెలివరీ చేశారు. మీర్జా నుంచి 4 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే పది సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు గ్రాములకు రూ.30 వేలకు పైగానే గూగుల్ పే ద్వారా చెల్లించినట్లుగా తెలిసింది. ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన డ్రగ్స్ పార్టీలో 10 మంది నిందితులు ఉన్నారని.. వారందరికీ మీర్జానే కొకైన్ అందజేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, వాహిద్ రిమాండ్ రిపోర్టులో డైరెక్టర్ క్రిష్ పేరును కూడా పోలీసులు ప్రస్తావించారు.