దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఈ- రేసింగ్కు భాగ్యనగరం అతిథ్యమివ్వనున్నది. హుస్సేన్సాగర్ తీరంలో ఈనెల 11న జరిగే ఈ మెగా ఈవెంట్కు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. పలు దేశాల నుంచి 21,000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈవెంట్ నిర్వాహకులతో కలిసి 2.8 కిలోమీటర్ల రేస్ ట్రాక్, ప్రేక్షకుల స్టాండ్లు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించి, భద్రతా అంశాలను సమీక్షించారు. కాగా, రియాద్ నుంచి బోయింగ్ 747-400 చార్టర్ విమానంలో రేసింగ్ కార్లు బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఈ రేస్కు ఈ నెల 11న హుస్సేన్ సాగర్ తీరంలో హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ), తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నది. ఈ తరుణంలో సిటీ పోలీసులు భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. పలు దేశాల నుంచి 21,000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. ఈవెంట్ నిర్వాహకులతో కలిసి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 2.8కిలోమీటర్ల రేస్ ట్రాక్, ప్రేక్షకుల స్టాండ్లు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించి, భద్రతా అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సీపీ ఆనంద్ మాట్లాడుతూ సుమారు 575 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. రేసింగ్ తిలకించేందుకు వచ్చేవారు పోలీసులకు సహకరించాలని, మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరారు. మొత్తం 16స్టాండ్లు 7గేట్లు 4ఫుట్ ఓవర్ బ్రిడ్జీల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రాక్ పై పెండింగ్లో ఉన్న పనులు, ఇతర ఏర్పాట్ల కోసం ఫిబ్రవరి 5 నుంచి ఎన్టీఆర్ మార్గ్ను మూసేయనున్నట్లు పేర్కొన్నారు.
వాస్తవానికి ట్రాఫిక్ మళ్లింపు ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 12న ముగుస్తుంది. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం జరగనున్నందున, ప్రముఖులు, వీవీఐపీల రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తారని, సచివాలయ రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నగర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్ములా ఈ సెక్యూరిటీ డైరెక్టర్ సాట్ అండర్సన్, మార్కో, అడిషనల్ సీపీ విక్రమ్సింగ్ మాన్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జి.సుధీర్బాబు, కార్ అండ్ ట్రైనింగ్ జాయింట్ సీపీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.