ఖైరతాబాద్, జనవరి 27 : మీడియాతో తనకు 40 ఏండ్ల అనుబంధం ఉన్నదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్యూజే) రూపొందించిన నూతన సంవత్సర డైరీని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, చంచల్గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో దొర్లే తప్పులను తాము గ్రహించకపోవచ్చని, అయితే మీడియా ద్వారానే వాటిని గుర్తించి సరిచేసుకుంటామన్నారు. అదే క్రమంలో పోలీసుల పనితీరుపై పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాలను తాము అస్సలు పట్టించుకోమన్నారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. హెచ్యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేశ్, బొమ్మగాని కిరణ్ కుమార్, వి.యాదగిరి, మల్లయ్య, రియాజ్ అహ్మద్, హెచ్యూజే కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్, హైదరాబాద్ ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, సహాయ కార్యదర్శి రమేశ్ వైట్ల, జాతీయ కౌన్సిల్ సభ్యులు అయిలు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.