సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ ‘డానీ’ ఆద్యంతం సినీ ఫక్కీలో కొనసాగింది. నగర శివారు రాజేంద్రనగర్లోని సన్సిటీలో నైజీరియా దేశానికి చెందిన ఓ యువకుడు కొకైన్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం అతడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో నైజీరియా దేశానికి చెందిన నెడాకా డానియల్ ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించి కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. అతడు ఎలా ఉంటాడు, ఏ వాహనంపై తిరుగుతున్నాడనేది పసిగట్టారు. పూర్తి ఆధారాలతో అదుపులోకి తీసుకోవాలనే లక్ష్యంతో ఏప్రిల్ 30న ఆపరేషన్ ‘డానీ’కి శ్రీకారం చుట్టారు.
20 మందితో గల్లీ గల్లీ చక్కర్లు
ఏప్రిల్ 30న సాయంత్రం 20మంది సభ్యులతో కూడిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం సన్సిటీని చుట్టుముట్టింది. మఫ్టీలో ఉన్న పోలీసులు డానీ కోసం కొన్ని గంటల పాటు గల్లీగల్లీకి తిరుగుతూ గాలించారు. సాయంత్రం కొకైన్ డెలివరీకి స్కూటీపై వెళ్తుండగా పట్టుకున్నారు.
పోలీసులను బురదలో తోసేసి..!
30న సాయంత్రం కొకైన్ డెలివరీ చేసేందుకు స్కూటీపై సన్సిటీ నుంచి బయటకు వస్తున్న డానీని గుర్తించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను స్కూటీతో ఢీ కొట్టిన డానీ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులతో పాటు డానీ సైతం బురదలో పడిపోయారు. వెంటనే తేరుకున్న డానీ స్కూటీని వదిలేసి పారిపోతుండగా.. వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు డానీని పట్టుకున్నారు. ఇలా డానీ ఆపరేషన్ ముగిసింది. అతడి వద్ద నుంచి దాదాపు రూ.1.70 లక్షల విలువ చేసే కొకైన్, ఎక్సటసీ పిల్స్, ఎండీఎంఏ మాదక ద్రవ్యాలు, ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్రవాహనంతో ఫొటో ఉంటేనే డ్రగ్స్
డానీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. అనేక విషయాలు బయటపడ్డాయి. డానీ ఢిల్లీలో ఉంటున్న ప్రధాన సూత్రధారి రిచర్డ్కు ఇక్కడ ఏజెంట్గా పని చేస్తున్నాడని తేలింది. రిచర్డ్ స్వయంగా డ్రగ్స్ను తీసుకువచ్చి డానీకి ఇస్తుంటాడని స్పష్టమైంది. ఆ తర్వాత డానీ ఫోన్కు వాట్సాప్లో లొకేషన్, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ద్విచక్రవాహనం మీద కూర్చొని ఉండే ఫొటోను పంపిస్తే.. వాట్సాప్ ఫొటోలో ఉండే ద్విచక్ర వాహనం నంబరు, ఫొటోలో ఉండే షర్టు రంగును పోల్చుకుని, దూరంగా ఉండి గమనించి నిర్ధారించుకున్న తర్వాతనే డానీ డ్రగ్స్ను డెలివరీ చేస్తాడని తెలిసింది. ఈ విధంగా గత ఏడాది జూన్ నుంచి డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు వివరించాడు. డానీ స్టూడెంట్ వీసాపై వచ్చి కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి ఆ తర్వాత రాజేంద్రనగర్ సన్సిటీలో నివాసముంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అతడి దగ్గర పాసుపోర్టు, వీసాలు ఏమీ లేవని పోలీసులు గుర్తించారు. డానీ ఫోన్లో ఉన్న చిట్టాను సైబరాబాద్ పోలీసులు క్రోడీకరిస్తున్నారు. తదుపరి విచారణ కోసం డానీని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.