సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): మార్పులన్నీ మన మంచికే. వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తొలినాళ్లకు.. ఇప్పటికి నగర ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు కల్పిస్తున్న అవగాహన నేపథ్యంలో ఇటీవల కాలంలో లాక్డౌన్ ఉల్లంఘనలు చాలావరకు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని ట్రై కమిషనరేట్ల పోలీసు బాసులే చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజల సహకారం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి రాకపోవడం వల్ల మూడు రోజుల నుంచి వాహనాల సీజ్లు తగ్గినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. సడలింపుల సమయంలో బయటకు వచ్చినప్పుడు భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి విషయాల్లో కూడా నిబంధనలు పాటిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సహకారం ఇలాగే కొనసాగితే త్వరలోనే కరోనా చైన్ను బ్రేక్ చేస్తామని కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్ తెలిపారు.