9.30 వరకు కొనుగోళ్లు… ఆ తర్వాత ఇండ్లకు
లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్న ప్రజలు
రంజాన్ రోజు ఇండ్లలోనే ప్రార్థనలు
నగరంలో పక్కాగా కొనసాగుతున్న లాక్డౌన్
సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ), చార్మినార్ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన 10 గంటల నిబంధనను పకడ్బందీగా పాటిస్తున్న ప్రజలు పదిలంగా ఇండ్లకు చేరుకుంటున్నారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన 4 గంటల వ్యవధిలోనే తమ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నారు. శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని పాతబస్తీ ప్రాంతాల్లో లాక్డౌన్ పరిస్థితిని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. అదనపు సీపీ చౌహాన్, సౌత్జోన్ డీసీపీ గజారావు భూపాల్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా నగర ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్నారని గుర్తించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలోని ప్రధాన ప్రాంతాల్లో ఉదయం 9.45 గంటల వరకు పోలీసు ఉన్నతాధికారులు పర్యటించి లాక్డౌన్ పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని సీపీ తెలిపారు. కిందిస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పడు అలర్ట్ చేస్తూ.. నింబంధనలను అతిక్రమించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామన్నారు. నగర వ్యాప్తంగా ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించడం వల్ల 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయని.. ఇలాగే ఉంటే త్వరలోనే కరోనా చైన్ను బ్రేక్ చేస్తామన్నారు సీపీ.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న మిరాయ్ ఎన్విరో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సందీప్రెడ్డి నగర పోలీసులకు 5 వేల సర్జికల్ మాస్కులు అందజేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులని.. వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
ఈనెల 12వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో న్యూబోయిగూడకు చెందిన లక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ కారణంగా క్యాబ్లు, ఆటోలు లేకపోవడమే కాకుండా అంబులెన్స్లు కూడా అందుబాటులో లేవంటూ.. ఆమె పక్కింట్లో ఉండే లక్ష్మి అనే మరో మహిళ గాంధీనగర్ పోలీసు స్టేషన్కు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఎస్ఎం గౌతమ్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మీరావలీలు పోలీసు వాహనంలో ఆ గర్భిణిని చికిత్స నిమిత్తం కింగ్కోఠి మెటర్నిటీ దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. ఆపదలో ఒక గర్భిణిని వెంటనే దవాఖానలో చేర్పించి.. మానవత్వాన్ని చాటుకున్న గాంధీనగర్ పోలీసులను సీపీ అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ మెహన్రావుతో పాటు కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందించి అభినందించారు.