మహానగరం మరింత సురక్షితంగా మారుతోంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఔటర్ రింగు రోడ్డు పరిధిలో పూర్తి స్థాయి భద్రత, పౌరుల రక్షణకు సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవల మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నగరంలో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలు ఉండగా, అదనంగా మరో 8వేల కెమెరాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ. 19.18కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను ఈఈఎస్ఎల్ కంపెనీకి అప్పగించారు. పోలీస్శాఖ సమన్వయంతో ఫ్లై ఓవర్లు, పార్కులు, చెరువులు, బస్తీ దవాఖాన, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్లు, మార్కెట్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర రద్దీ ప్రాంతాలలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ):
హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.., ఔటర్ రింగు రోడ్డు పరిధిలో పూర్తి స్థాయి భద్రతకు, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలో ‘పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి శాంతిభద్రతల నిర్వహణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, నగరంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదనంగా 8వేల సీసీ కెమెరాలు
ఓఆర్ఆర్ పరిధిలో ఇప్పటి వరకు సీసీ టీవీ సర్వీలెన్స్ కెమెరాలు లేని ఇతర అన్ని ప్రాంతాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సీసీ టీవీ సర్వీలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఆదేశిస్తూ జీవో 167ను జారీ చేసింది. ఓఆర్ఆర్ను ఆనుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఫార్మా, సర్వీస్ సెక్టార్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా, ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రతా ప్రమాణాలను మరింత పటిష్ట పర్చాలనే లక్ష్యంతో ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా 8వేల కెమెరాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.19.18 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను ఈఈఎస్ఎల్ కంపెనీకి అప్పగించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, రెండేండ్ల పాటు సదరు కంపెనీ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నది. బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సదరు కంపెనీకి పనుల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
నిఘా నీడలో గ్రేటర్
పోలీస్శాఖ సమన్వయంతో జీహెచ్ఎంసీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నది. పోలీస్శాఖ ఓఆర్ఆర్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్ఎల్), సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్/ఓఆర్ఆర్), సెంట్రల్ పవర్ డిస్కమ్ (టీఎస్ ఎస్పీడీసీఎల్), మార్కెటింగ్, ఇరిగేషన్ తదితర సంబంధిత ప్రభుత్వ శాఖలను, విభాగాలను కూడా సమన్వయం చేయనున్నది. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న తరుణంలో ఇక్కడ మరింత నిఘా పెంచనున్నారు. ప్రధానంగా ఫ్లై ఓవర్లు, పార్కులు, చెరువులు, బస్తీ దవాఖానలు, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్లు, మార్కెట్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.