కంటోన్మెంట్లో బాహాబాహీకి దిగిన నేతలు
రెండు గ్రూపులుగా విడిపోయిన వైనం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 2: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీజేపీలో వర్గపోరు ముదిరింది. యుద్ధాలకు దిగుతున్నారు. గత కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న బీజేపీ నాయకులు ఒక్కసారిగా రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం డైమండ్ పాయింట్ చౌరస్తాలోని గాయత్రి గార్డెన్స్లో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్ నేతృత్వంలో సమావేశమయ్యారు. మన్ కీ బాత్ కార్యక్రమం పూర్తవగానే పలువురిని వేదికపైకి పిలిచారు.
మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆకుల నగేశ్ను వేదికపైకి పిలవకపోవడంతో రచ్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి మధ్య అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయి. బహిరంగ విమర్శలకు మాత్రం దిగలేదు. అయితే, వేదికపైకి పిలవకపోవడంతో ఇరు వర్గాలకు చెందిన శ్రేణులు కొట్టుకోవడమే తరువాయిగా మారింది. పార్టీ కార్యక్రమాలను కొంతమంది ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారని ఉపాధ్యక్షుడు కోపంతో అధ్యక్షుడిపై మండిపడ్డాడు. ప్రొటోకాల్ పాటించకుండా సీనియర్ నేతను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు ఈరోజు ఉంటారు.. రేపు మళ్లీ జెండాలు మార్చుతారంటూ నిప్పులుగక్కారు. ఇంతలో పలువురు సీనియర్ నేతలు కల్పించుకుని ఇరువర్గాల నేతలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమనిగింది.