అమీర్పేట్, డిసెంబర్ 12 : వచ్చే జూన్ నాటికి ఎస్ఆర్నగర్లో చేపడుతున్న మోడ్రన్ కమ్యూనిటీ హాలు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. అమీర్పేట్ డివిజన్లోని ఎస్ఆర్నగర్ పాత కమ్యూనిటీ హాలు స్థానంలో రూ. 15 కోట్లతో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్తో కూడిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాలుకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ సౌకర్యార్థం డబుల్ సెల్లార్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, ఇందులో మొదటి సెల్లార్ పూర్తయ్యిందని, రెండో సెల్లార్ వారం రోజుల్లో పూర్తవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ ఎస్ఆర్నగర్ చుట్టుపక్కల కాలనీల్లో కమ్యూనిటీ హాలు లేని కారణంగా ఇక్కడి నివాసితులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి పెద్ద కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాత కమ్యూనిటీ హాలు స్థానంలో నూతన కమ్యూనిటీ హాలును పూర్తి వసతులతో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇక్కడి గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలతో పాటు హాలును నిర్మిస్తామని, మొదటి ఫ్లోర్ను డైనింగ్ కోసం వినియోగించడం జరుగుతుందని, హాలుకు వచ్చే వారికి వాహనాల పార్కింగ్ సమస్య లేకుండా డబుల్ సెల్లార్తో నిర్మాణాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి ఈ హాలు నిర్మాణాలను పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ హాలు ప్రహరీ చుట్టూ ఆక్రమణలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు సీఈ శ్రీనివాస్, ఈఈ కిరణ్బాబు, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, ఈఈ ఇందిర, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేశ్, అమీర్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు పాల్గొన్నారు.