సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తేతెలంగాణ): ప్రతిష్ఠాత్మకమైన టై గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో ప్రారంభమైన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్(టీఐఈ) 46 చాప్టర్లు, 700 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. మొదటి రోజు విజయవంతమైన స్టార్టప్ల వ్యవస్థాపకులు, మార్గదర్శకులు, వెంచర్ క్యాపిటలిస్టులతో నెట్వర్క్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త వ్యాపార ఆలోచనలు, వాటికి అవసరమైన నిధులను సమకూర్చుకునే అవకాశాలను పరస్పరం వారు పంచుకున్నారు. బిజినెస్ కెరియర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది టై గ్లోబల్ సదస్సు అని.. వ్యాపార విస్తరణకు ఇది చక్కటి వేదిక అని సమ్మిట్కు వచ్చిన వ్యాపారవేత్తలు కొనియాడారు. అంతేకాక దేశంలో స్టార్టప్ వ్యవస్థను వేగవంతం చేయడంలో టీ హబ్ అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నదన్నారు. మరోవైపు 13, 14 తేదీల్లో వివిధ అంశాలపై చర్చలు, నెట్వర్క్ మీటింగ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక స్టాళ్లు..
టై గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నెట్వర్క్, హెల్త్టెక్, అగ్రిటెక్, ఎడ్యుటెక్, మెడిటెక్, ఫిన్టెక్లు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అంతేకాక గేమింగ్, ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యాధునిక టెక్నాలజీని అందించే స్టార్టప్లు తమ వస్తువులను ప్రదర్శనకు పెట్టాయి.
హైదరాబాద్ బిజినెస్ హబ్గా మారింది
ప్రస్తుతం హైదరాబాద్ బిజినెస్ హబ్గా మారింది. హైదరాబాద్ కంపెనీలు దుబాయ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా రియల్ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు పెరుగుతున్నాయి. మా కంపెనీ హోమ్స్ ఫర్ లైఫ్ రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి స్థాయిలో సేవలను అందిస్తోంది. టై గ్లోబల్ లాంటి సదస్సులు వ్యాపారాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయి.
– దీపక్ మోహన్,హోమ్స్ ఫర్ లైఫ్ కంపెనీ ప్రతినిధి
ప్రభుత్వ సహకారంతోనే టై గ్లోబల్ సదస్సు
ప్రభుత్వ సహకారంతోనే 7వ టై గ్లోబల్ సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. ఈ నగరానికి ఎన్నో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే సత్తా ఉందన్న విషయం టై గ్లోబల్ సదస్సుతో నిరూపితమైంది. ఎంతో ప్రతిష్ఠాతకమైన ఈ సదస్సు నిర్వహణకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఎంతో సహకారమందించారు. స్టార్టప్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
– మురళీ బుక్కపట్నం, టై గ్లోబల్ వైస్ చైర్మన్