కందుకూరు, ఫిబ్రవరి 3: ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె రైతులను కోరారు. అన్నోజిగూడ సర్పంచ్ కాకి ఇందిరమ్మ దశరథ ముదిరాజ్, పలువురు రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం మంత్రిని కలిశారు. ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా రైతుల వద్ద తీసుకున్న భూములకు గాను పరిహరం చెల్లించలేదని, అదే విధంగా గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలను మంజూరు చేయాలని వారు మంత్రిని కోరారు.
ఫార్మాసిటీ రైతుల విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అన్నోజిగూడ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, గోరెంకల యాదయ్య ముదిరాజ్, మండల యువజన విభాగం నాయకుల గోరెంకల రామక్రిష్ణ, గ్రామ అధ్యక్షుడు డాక్టరు జంగయ్య, వార్డు మెంబర్లు ఎడ్ల క్రిష్ణయ్య, విద్యా కమిటీ చైర్మన్ జక్కుల మహేందర్, దేవేందర్, రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.