మహానగర ట్రై కమిషనరేట్లలో కొత్త సీపీలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనిహైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పాత కమిషనర్ సందీప్ శాండీల్య నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీగా
సుధీర్ బాబు బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల కొత్త పోలీసు బాసులుగా బుధవారం కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, సుధీర్బాబు, అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. వీరికి మూడు కమిషనరేట్ల అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ప్రజల భద్రతే మా బాధ్యత.. అంటూ ముగ్గురు సీపీలు భరోసా ఇచ్చారు. సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబు బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. పలువురు అధికారులు, కార్యాలయం సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలిచ్చి కమిషనర్ కార్యాలయంలోకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సుధీర్బాబు బుధవారం డీసీపీలు, ఏసీపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, నేర నియంత్రణలో సీసీ టీవీ కెమెరాల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తూ.. ప్రతి కేసులో నేరాన్ని నిరూపించేందుకు కృషి చేస్తామన్నారు. సివిల్, ఏఆర్, బెటాలియన్, ట్రాఫిక్ తదితర విభాగాలను సమన్వయం చేస్తూ అందరి సహకారంతో పనిచేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్ను మరింత బలోపేతం చేస్తామన్నారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూ సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, రౌడీ షీటర్స్పై ఎప్పటికప్పుడు నిఘా పెడుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే రిటైర్డ్ పోలీసు అధికారుల సలహాలు కూడా తీసుకుంటామన్నారు. గతంలో రాచకొండ అదనపు కమిషనర్గా పనిచేసిన అనుభవంతో అన్ని ప్రాంతాలపై సంపూర్ణ అవగాహన ఉన్నదని, మూడు కమిషనరేట్ల పోలీసులమంతా సమన్వయంతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రజలకు మీ భద్రత.. మా బాధ్యత.. అంటూ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి, మహేశ్వరం, ఎల్బీనగర్, ఉమెన్ సెఫ్టీ, రోడ్డుసేఫ్టీ, క్రైమ్స్ డీసీపీ, అడ్మిన్ డీసీపీలు ధరావత్ జానకీ, శ్రీనివాస్, సాయిశ్రీ, ఉషా విశ్వనాథ్, శ్రీబాల, అరవింద్, ఇందిరా తదితర అధికారులు పాల్గొన్నారు.