Hyderabad Metro | సిటీబ్యూరో: ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల వరకు, ఆ తర్వాత తెల్లవారు జామున 3-4 గంటల నుంచే నగర వాసులు తమ రోజు వారీ కార్యకలాపాల్లో నిమగ్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో నగర వాసులకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉంచేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేపట్టారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆ తర్వాత మెట్రో రైలు ప్రధానంగా ఉంది. ప్రైవేటు రంగంలో ఆటోలు, క్యాబ్లు, ద్విచక్రవాహనాలను గణనీయంగా వినియోగిస్తున్నారు. అయితే రాత్రి పది గంటల నుంచి 12 గంటలు, ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య ప్రయాణికులకు ప్రజా రవాణా వ్యవస్థల కొరతను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే మెట్రో కారిడార్లు విస్తరించి..ఉన్న 3 మార్గాల్లో మెట్రో రైళ్ల వేళలను పొడిగించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న దానిపై ఇటీవలే మెట్రో అధికారులు ప్రయోగాత్మకంగా సోమ, శుక్రవారాల్లో రైళ్ల వేళల పొడిగింపును ప్రకటించారు. ఈ సమయంలోనే మెట్రో ప్రయాణికుల పెరుగుదలను అధ్యయనం చేసి, మరింత సమయం పెంచేందుకు అవకాశం ఉన్నదని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.
ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి(హైదరాబాద్) రైల్వే స్టేషన్, బేగంపేట, మలక్పేట రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారి కోసం ఎలాంటి సమయాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంచాలన్న దానిపై అధికారులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రాత్రి 11-12 గంటల మధ్య, ఉదయం 4-6 గంటల మధ్య ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.
మెట్రో నినాదమైన లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇంటి నుంచి బయలు దేరింది మొదలు కొని.. చివరి గమ్యస్థానం చేరే వరకు మెట్రోను ప్రధాన ప్రయాణంగా మార్చుకునేలా.. రైళ్ల వేళల పొడిగింపును ప్రయోగాత్మకంగా చేపట్టారు. కొత్త టైమ్ టేబుల్తో ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా.. ఆయా ప్రాంతాలు, సమయాలను నిర్ణయించే పనిలో మెట్రో యంత్రాంగం నిమగ్నమైంది.