కార్వాన్, డిసెంబర్ 23 : గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 68 సమీపంలోని అంకుర ప్రైవేట్ హాస్పిటల్ పదంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పదో అంతస్తుపైన ఉన్న దవాఖానా ఎలక్ట్రిక్ బోర్డులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
దీంతో దవాఖానాలో చిన్నారులు, ఇతర రోగులను ఇతర దవాఖానాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగనట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయిఉద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, సౌత్వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీసీ అశ్వక్, గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ ముజీబుర్ రహ్మాన్ ప్రమాద స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు.
గుడి మల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నిలువరించడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం అద్భుత పనితీరు కనబరించిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం ఎక్స్లో తెలిపారు. సిబ్బంది పనితీరుకు హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు. అనంతరం ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ తన ఎక్స్లో డీఆర్ఎఫ్ కృషితో ఎలాంటి ప్రమాదం లేకుండా ఫైర్ను అదీనంలోకి తీసుకొచ్చామని చెప్పారు.