సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో విభిన్న కార్యాక్రమాలు అందరినీ అలరించాయి. సైఫాబాద్లోని విద్యారణ్య పాఠశాలలో మూడోరోజు సాహిత్య చర్చలు.. చిన్నారుల చిత్రకళ.. యువత రాక్ డ్యాన్స్, స్టోరీ టెల్లింగ్స్తో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కోలాహలంగా కొనసాగింది. ఆదివారం చివరిరోజు (సెలవు రోజు) కావడంతో చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు, సాహిత్య ప్రియులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం లిటరరీ ఫెస్ట్ ఘనంగా ముగిసింది.
పుస్తక దానం.. గ్రంథాలయానికి ఊపిరి
పుస్తకాన్ని దానం చేస్తే.. గ్రంథాలయానికి ఊపిరి పోయడమేనని ఫుడ్ ఫర్ థాట్ సంస్థ సాహిత్య ఉద్యమాన్ని షురూ చేసింది. ఇప్పటి వరకు దాతల నుంచి 1,48,759 పుస్తకాలను సేకరించింది. వీటితో 587 లైబ్రరీలు ఏర్పాటు చేసింది. ప్రతి బుక్కు బార్ కోడ్ జోడిస్తూ.. మొబైల్ యాప్తో దాతలు అందజేసిన పుస్తకాలను
వారే స్వయంగా ట్రాక్ చేసుకునే వీలును
కల్పించారు.
పౌరాణిక కథలకు ప్రాణం..
లిటరరీ ఫెస్టివల్లో ‘క్యూర్ కోడ్ టీ’ అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. డిజిటైజింగ్ ‘ఎండేంజర్డ్ స్టోరీస్’ (అంతరించిపోతున్న కథలు) పేరుతో పురాణాలు, ఇతిహాసాల కథలు తెలిసేలా ఈ చెట్టును తీర్చిదిద్దారు. బహు భాషల్లో ఆయా కథలను ఆడియో విధానంలో పొందుపర్చారు. ట్రీ పై ఉన్న క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే యూట్యూబ్ లింక్కు తీసుకెళ్లేలా రామాయణం, శివపురాణం, కృష్ణ, మహాభారతం, హనుమాన్, గణేశ్ అంటూ ఒక్కో క్యూర్ కోడ్పై ఆడియోలు రూపొందించినట్లు ఫుడ్ ఫర్ థాట్ సంస్థ కో ఫౌండర్ షెపాలి రావు తెలిపారు.
ఉర్రూతలూగించిన రాక్బీట్..
ది ఎన్ఆర్బీ బీట్సిటీ పేరుతో హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్లో నిర్వహించిన డ్యాన్స్ యువతను ఉర్రూతలూగించింది. అదిరిపోయే స్టెప్పులు.. కుర్రకారు కేరింతలతో సందడిగా మారింది. రాహుల్, నిఖిల్, భార్గవ్, కృష్ణ, రాజీవ్లు తమ గానామృతాన్ని రాక్బీట్ విధానంతో కిక్కెక్కించారు.
చర్చాగోష్ఠిలో పాల్గొన్న పలువురు..
పుస్తక వేడుకలో శ్రయన, రాంమనోహర్రెడ్డి, మన్రీత్ సోధి సోమేశ్వర్, సునీత, రేఖాకామత్ రంజన్, ఉమాదామోదర్, శ్రీధర్, శ్రీలత, సోమేశ్వర్ సతి, మానస ఎండ్లూరి, దివ్య కందుకూరి, ఉషారామన్, మౌవా చినప్ప, అనిరుద్ భట్టాచార్జి, పార్థివ్ధర్, సత్యశరణ్, అనురాధనాయక్ తదితరులు సాహిత్య చర్చాగోష్ఠిలో పాల్గొని ప్రసంగించారు.