హైదరాబాద్ : పంజాగుట్ట బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండటమే కాకుండా, భిక్షాటన కూడా చేయను అని తల్లికి ఎదురు సమాధానం చెప్పడంతో.. అన్నెం పున్నెం ఎరుగని ఆ బాలికను శారీరకంగా వేధించి చంపేశారు.
బాలిక మెహాక్ హత్య కేసులో తల్లి హీనా బేగంతో పాటు ఖాదర్ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ శ్రీనివాస్ రావు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించారు.
మియాపూర్కు చెందిన హీనా బేగం, ఆమె భర్త గత కొన్నేండ్ల నుంచి భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు మెహాక్(4), మూడేండ్ల కూతురు, ఒక మగ పిల్లాడు ఆఫన్(7) ఉన్నాడు. ఆఫన్, మెహాక్ తల్లి హీనా వద్ద ఉంటుండగా, మూడేండ్ల కూతురు అమ్మమ్మ వద్ద ఉంటోంది.
అయితే దొంగతనం కేసులో హీనా బేగం భర్త ఆరు నెలల క్రితం జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో హీనా బేగానికి పాతబస్తీ డబీర్పురాకు చెందిన ఖాదర్తో కల్లు కంపౌండ్లో పరిచయం ఏర్పడింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే భిక్షాటన కోసం హీనా, ఖాదర్ కలిసి బెంగళూరు, ముంబై, పుణె, జైపూర్ వంటి ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారు. వీరితో పాటు మెహాక్ను కూడా తీసుకెళ్తున్నారు.
గత 20 రోజుల నుంచి హీనా, ఖాదర్ బెంగళూరులో భిక్షాటన చేస్తున్నారు. మెహాక్ మాత్రం తాను భిక్షాటన చేయను. మా నాన్న దగ్గరికి తీసుకెళ్లు. ఈ ఫాదర్ ఇష్టం లేదు అని హీనాకు ఆమె చెప్పింది. దీంతో తన మాట వినట్లేదని మెహాక్ను ఈ నెల 3వ తేదీన రాత్రి తీవ్రంగా కొట్టారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. దీంతో మెహాక్ స్పృహ తప్పి పడిపోయింది.
బాలిక స్పృహ కోల్పోవడంతో.. ఆమెను హైదరాబాద్లో వదిలేస్తే తాము పోలీసులకు దొరకమని హీనా, ఖాదర్ భావించారు. హైదరాబాద్లో తమను ఎవరూ గుర్తు పట్టే అవకాశం లేదని భావించారు. దీంతో 3వ తేదీ రాత్రి 12:30 గంటలకు బెంగళూరు నుంచి ముగ్గురు ప్రయివేటు బస్సులో హైదరాబాద్కు వచ్చారు. ఖైరతాబాద్లో దిగే సమయానికే బాలిక చనిపోయింది. దీంతో బాలికను పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ద్వారకపూరీ కాలనీలో వదిలేశారు. బాలికను వదిలేసిన అనంతరం వారు జైపూర్ వెళ్లి భిక్షాటన చేశారు. అక్కడ్నుంచి బెంగళూరు వెళ్లి కూడా భిక్షాటన చేశారు. తిరిగి హైదరాబాద్కు వస్తే జూబ్లీ బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు.
హీనా బేగం, ఖాదర్ కలిసి బెంగళూరులో భిక్షాటన చేస్తూ రోజుకు రూ. 2 వేలు సంపాదించేవారు. వచ్చిన సంపాదనలో ప్రతి రోజు రూ. 800 చెల్లించి ఓ హోటల్లో ఉంటున్నారు. మిగతా డబ్బును ఇతర ఖర్చులకు ఉపయోగించేవారు. మిగిలిన డబ్బుతోనే బెంగళూరు నుంచి హైదరాబాద్కు ప్రయివేటు బస్సులో వచ్చారని జాయింట్ సీపీ శ్రీనివాస్ రావు తెలిపారు.