సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): మన రాజధానిలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం చాలా సంతోషించాల్సిన అంశమని, హైదరాబాద్లో క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా మారిందని, వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ బృందం 2023-జెర్సీని ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడితో కలిసి మంత్రి కేటీఆర్ నగరంలో ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్లో అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ బృందానికి అభినందనలు తెలిపారు. వాలీబాల్ చరిత్రలో మన నగరానికి మంచి రికార్డు ఉందని పేర్కొన్నారు. స్వదేశీ ప్రీమియర్ వాలీబాల్ టోర్నమెంట్ రెండో ఎడిషన్ను నిలుపుకోవడానికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమాని అభిషేక్రెడ్డి కంకణాల, శ్యామ్ గోపు, తదితరులు పాల్గొన్నారు.