Ganja Smugglers | సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): టోల్ ప్లాజాల వద్ద జిమ్మిక్కులు చేస్తూ ఏపీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. యూపీకి చెందిన వికాస్ త్యాగి, అబ్రార్, ఎండీ అమీరుద్దీన్ స్నేహితులు. ఉత్తర్ప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన గంజాయి స్మగ్లర్తో ఈ ముగ్గురు స్నేహితులకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరట్కు గంజాయి తీసుకొచ్చి ఇస్తే.. మంచి కమీషన్ ఇస్తానంటూ సూచించడంతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలో రాజమండ్రి వెళ్లేందుకు వారికి కారును అప్పగించాడు. దీంతో ముగ్గురు కారులో వెళ్లి 360 కిలోల గంజాయిని కొనుగోలుచేసి.. 72 ప్యాకెట్లలో నింపి, కారులో తెలంగాణ మీదుగా యూపీకి బయలుదేరారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలిసి ఓఆర్ఆర్ వద్ద కారును ఆపి తనిఖీలు చేయగా.. అందులో 360 కిలోల గంజాయి పట్టుబడింది. గతంలో కూడా నిందితులు గంజాయి రవాణా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కారుతో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ ఎల్బీనగర్ డీసీపీ మురళీధర్, ఏసీపీ మట్టయ్య, అబ్దుల్లాపూర్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నిందితులు టోల్గేట్ల వద్దకు రాగానే అర కిలోమీటరు దూరంలోనే కారును ఆపేస్తారు. అందులో నుంచి ఒకరు దిగి పైలెట్గా వ్యవహరిస్తాడు. టోల్గేట్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా..? తనిఖీలు జరుగుతున్నాయా..? పరిశీలిస్తాడు. ఎవరు లేకుంటే ముందుకు వెళ్తారు. అక్కడ పోలీసులు ఉన్నట్టు తెలిస్తే వారు వెళ్లిపోయిన తరువాతే ఆ టోల్గేట్ దాటుతారు. నిందితుల కారు నంబర్ కూడా పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు ఇతర కార్లకు సంబంధించిన నంబర్ ప్లేటు, ఫాస్ట్ ట్యాగ్ను వాడుతుంటారు. నిందితులు ఒక్కో చోట ఒక్కో నంబర్ను వాడటంతో పోలీసులు కూడా తికమక పడుతుంటారు. ఇలా జిమ్మిక్కులు చేస్తూ టోల్గేట్ల వద్ద ఎవరికీ చిక్కకుండా పరారవుతుంటారు.