Hyderabad | చాదర్ఘాట్, ఫిబ్రవరి 23: చాదర్ఘాట్, ముసారాంబాగ్ పై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాదర్ఘాట్ కాజ్ వే, ముసారాంబాగ్-అంబర్పేటలో ఉన్న లోలెవెల్ బ్రిడ్జి స్థానంలో నూతనంగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో బ్రిడ్జి పనులకు సూత్రప్రాయంగా నమూనాలను సిద్ధం చేశారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు చాదర్ఘాట్ కాజ్ వే బ్రిడ్జి, ముసారాంబాగ్ లోలెవెల్ బ్రిడ్జిలు పూర్తిగా మునిగిపోయాయి. వాటి పై నుంచి వరద ప్రవాహం కొనసాగింది. దీంతో సమీప కాలనీలు, బస్తీలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వరద సమస్యకు చెక్ పెట్టేందుకు నూతనంగా బ్రిడ్జిల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నమోదైన కనిష్ఠ వరద స్థాయికి అనుగుణంగా బ్రిడ్జి ఎత్తును నిర్మిస్తున్నట్లు తెలిసింది. చాదర్ఘాట్ వద్ద 1890లో నిర్మించిన ఒలిఫెంట బ్రిడ్జి ఎత్తులో కాజ్ వే వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
చాదర్ఘాట్ కాజ్వే బ్రిడ్జి, ముసారాంబాగ్-అంబర్పేటలో ఉన్న లోలెవెల్ బ్రిడ్జిల స్థానంలో నూతనంగా నిర్మించే బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ.94కోట్లు ఖర్చు చేయనుంది. చాదర్ఘాట్ హై లెవెల్ బ్రిడ్జికి రూ.42కోట్లు, ముసారాంబాగ్ బ్రిడ్జిలను రూ.52 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
చాదర్ఘాట్ వద్ద నాలుగు లేన్లు, ఫుట్పాత్ ఉండే విధంగా నమూనాను సిద్ధం చేశారు. బ్రిడ్జి వెడల్పు 21 మీటర్లు, పొడవు 220 మీటర్లు, ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి మరో 9మీటర్ల ఎత్తులో కొత్తగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. అలాగే ముసారాంబాగ్లో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఆరు లేన్లు, మధ్యలో సెంట్రల్ మీడియన్, ఇరువైపులా ఫుట్పాత్లు ఉండేలా రూపకల్పన చేశారు. బ్రిడ్జి వెడల్పు 29.5 మీటర్లు, పొడవు 220 మీటర్లు, గ్రౌండ్ లెవెల్ నుంచి 15 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు.
నగర వారసత్వం, సంస్కృతి ప్రతిబింబించే విధంగా బ్రిడ్జిలను నిర్మించనున్నారు. నిర్మాణంలో బ్రిడ్జి రెయిలింగ్కు ఇరువైపులా ఆకర్షణీయమైన కట్టడాలు, లైటింగ్ వ్యవస్థ కూడా ఉండేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రిడ్జిల డిజైన్లను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఖరారు చేసిన తరువాత తుది డిజైన్ రూపకల్పన చేస్తారని అధికారులు పేర్కొన్నారు.