కుత్బుల్లాపూర్, డిసెంబర్16 : ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ ఇండోర్ తీన్ఇమ్లీ ప్రాంతానికి చెందిన బబ్లూఖరే అలియా స్ కృష్ణ (23), బర్నావర్కు చెందిన గోవింద్ పాటిదార్(42) లారీ డ్రైవర్లు. ఇద్దరు కలిసి ఒడిశా ప్రాంతానికి చెందిన బబ్లూ నుంచి మహారాష్ట్ర లాతూర్లో ఉన్న అరవింద్ వద్దకు 400 కేజీల ఎండు గంజాయిని లారీలో నర్సరీ మొక్కల మాటున తరలిస్తున్నారు.
ఈ క్రమంలో మార్గమధ్యలో జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే… విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం బాలానగర్ ఎస్ఓటీ టీంతో పాటు జీడిమెట్ల పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టుకున్నారు. కాగా రూ.కోటి విలువ చేసే ఎండు గంజాయితో పాటు లారీ, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు డ్రైవర్లను రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితులు బబ్లూ, అరవింద్ పరారిలో ఉన్నారు.