హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నలుగురు బడా వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టును వెల్లడించిన పోలీసులు.. బడా వ్యాపారవేత్తలతో పాటు మరో 10 మంది నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వ్యాపారవేత్తలు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అశోక్ జైన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు పంజాగుట్ట పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు టోనీని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టోనీని పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు తాజాగా అనుమతిచ్చింది. టోనీని విచారిస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. రేపు టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం టోనీ జైలులో ఉన్నాడు.
నైజీరియాకు చెందిన టోనీ 2019 నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2013లో భారత్కు మూడు నెలల పర్యాటక వీసాపై టోనీ వచ్చాడు. నైజీరియాకు విగ్గులను సరఫరా చేసిన టోనీ.. ఆ తర్వాత డ్రగ్స్ సరఫరాను ప్రారంభించాడు. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. అంధేరీలోనే నైజీరియాకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. నైజీరియా నుంచి షిప్స్ ద్వారా ముంబైకి డ్రగ్స్ను తెప్పించేవాడు. వాటిని.. ముంబై, గోవాతో పాటు హైదరాబాద్లో విక్రయించేవాడు. ఇప్పటి వరకు తన దగ్గర 13 మంది డ్రగ్స్ కొన్నట్టు టోనీ పోలీసుల విచారణలో వెల్లడించాడు.