బేగంపేట్ మార్చి 8: పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. ‘ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ ఆధ్వర్యంలో మంగళవారం బేగంపేట్ తాజ్ వివాంత హోటల్లో మహిళ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు నేడు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుండటం గర్వంగా ఉందని అన్నారు. కొన్ని రంగాల్లో మాత్రం వివక్షకు గురవుతున్నారని, దాన్ని రూపుమాపేందుకు ‘జండర్ ఫర్ ఈక్వాలిటీ ఫర్ ఏ సస్టేనబుల్ టుమారో’ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదన్నారు. పారిశ్రామికంగా వృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. ఎంపిక చేసిన 10 మంది మహిళలకు ఈ సందర్భంగా కుట్టు మిషన్లతో పాటు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు భగవతీదేవి, వింటా ల్యాబ్ ఎండీ హరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.