సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ): 104 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ‘ఉస్మానియా తక్ష్-2022’ పేరుతో ‘కనెక్ట్ అండ్ రీ-కనెక్ట్ టు గ్రో’ నినాదంతో అతి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఓయూ సాధించిన పరిశోధనల ఫలాలు ఇప్పటి వరకు చాలా మందికి తెలిసే అవకాశాలు లేకుండా పోయాయని, ఇప్పుడు వాటిని సాధారణ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలిసే విధంగా వాటిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఓయూ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఉస్మానియా తక్ష్’ ప్రదర్శనపై వీసీ రవీందర్ పలు వివరాలను వెల్లడించారు. ఓయూ ఔన్నత్యం, పరిశోధనలు, ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు వంటి వాటిని ఆయా విభాగాల వారీగా ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.
25న పూర్వ విద్యార్థుల సమ్మేళనం
‘ఉస్మానియా తక్ష్’ నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 25న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంటుందన్నారు. దాదాపు 900 నుంచి 1000 మంది వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంటుందన్నారు. అయితే, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు ఈ సమావేశం నిర్వహించుకుని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఠాగూర్ ఆడిటోరియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా పూర్వ విద్యార్థుల సహాయంతో కొత్త భవనాలు, కొత్త హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులు వంటి వాటిని నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. అయితే, నిధుల సమీకరణ కోసం ఓయూ ఆధ్వర్యంలో ఒక పూర్వ విద్యార్థుల డైరెక్టరేట్ను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
26న పలు సాంస్కృతిక కార్యక్రమాలు
‘తక్ష్’ నిర్వహణలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 26న సాయంత్రం 4 గంటల నుంచి 7.30 వరకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమాలు వీక్షించడానికి సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఓయూ సిబ్బంది, అందరూ హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఓయూలోని ల్యాండ్ స్కేప్ గార్డెన్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఆఫీసర్ ఆన్ డ్యూటీ టూ వీసీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ తదితరులు పాల్గొనున్నట్లు వీసీ తెలిపారు.
టెక్నాలజీ కళాశాల సర్వం సిద్ధంప్రిన్సిపాల్ చింతా సాయిలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ‘ఉస్మానియా తక్ష్-2022’ అనే కార్యక్రమం నిర్వహణకు టెక్నాలజీ కళాశాల సర్వం సిద్ధంగా ఉందని ఓయూ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ చింతా సాయిలు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రత్యేకత ఉండేలా పలు కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిపారు. మొదటి రోజు 24న ఓపెన్ డే, 25న పూర్వ విద్యార్థుల సమ్మేళనం, 26న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.