సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): ఎంబీఏ చేసిన ఆ గృహిణి.. నకిలీ పత్రాలతో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం ఖాయమని చెప్పగానే నమ్మేసింది. చేసేది తప్పని తెలిసినా.. అమాయకంగా సైబర్నేరగాడు చెప్పినట్లు చేసేసింది. చివరకు భర్త, కుటుంబసభ్యులకు తెలియకుండానే అప్పులు చేసి.. బంగారాన్ని కూడా తాకట్టుపెట్టి.. అతడి ఖాతాలో జమ చేసింది.. ఇలా సైబర్నేరగాడు ఆడిన నాటకంలో ఆమె…మొత్తం రూ. 8.93 లక్షలను పోగొట్టుకుంది. చివరకు సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించి..న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో వెల్లడించిన వివరాల ప్రకారం..మణికొండకు చెందిన ఓ మహిళ(34) ఎంబీఏ చదివింది. ఫేస్బుక్లో ప్రకటన చూసి.. లింక్ను క్లిక్ చేసింది. ఈ క్రమంలో సిద్ధు విశ్వేన్ పేరుతో ఆగంతకుడు తాను ఓ కంపెనీలో పనిచేస్తానంటూ.. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని.. రెస్యూమెను పంపాలని సూచించాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఫేక్ ఫాం-16లను రూపొందించేందుకు రూ. 20 వేలు కావాలని ఖాతాను ఇచ్చాడు. రెండోసారి ఫోన్ చేసి.. హెచ్ఆర్, మెనేజర్, హెచ్ఆర్ హెడ్ను సముదాయించాలి.. మరికొంత డబ్బు కావాలని అడిగాడు.
ఆ తర్వాత తాను ఓ యాక్సిడెంట్ చేశానని.. పోలీసులకు లంచం ఇవ్వడానికి రూ. 4 లక్షలు కావాలన్నాడు. ఒక వేళ డబ్బులు ఇవ్వకపోతే ‘నీకు ఉద్యోగం రాదు.. ఇప్పటి వరకు చెల్లించిన నగదును ఇవ్వలేన’ని బెదిరించాడు. గందరగోళానికి గురైన బాధితురాలు.. అడిగినంత చెల్లించింది. మరో రూ. 4 లక్షలు కావాలని.. బతిమిలాడాడు. ఆమె వద్ద అంత డబ్బులు లేకపోవడంతో అతడి సూచన మేరకు భర్త, కుటుంబసభ్యులకు తెలియకుండా బంగారాన్ని తీసుకువచ్చి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి..రూ. 2 లక్షలు తీసుకుంది. మరో 2 లక్షలు తెలిసిన వారి వద్ద అప్పుచేసి.. కట్టింది. ఉద్యోగం రాకపోవడం, అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో బాధితురాలు అతడికి ఫోన్ చేసి.. తనకు జాబ్ వద్దని.. తీసుకున్న డబ్బు ఇచ్చేయమని నిలదీసింది. అయితే అతడు వాయిదాలు వేస్తుండటంతో.. మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.