మేడ్చల్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1,769 ఉద్యోగాలు భర్తీ కానుండగా.. క్రమబద్ధీరణతో 200 పైచిలుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఓసీకి 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49, దివ్యాంగులకు 54ఏండ్ల వరకు వయో పరిమితి పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ సందర్భంగా నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, యువకులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దీంతో ఉద్యోగులపై పనిభారం తగ్గుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-రవిప్రకాశ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు
చారిత్రక నిర్ణయం
సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కే విధంగా కృషి చేసిన సీఎం కేసీఆర్కు నిరుద్యోగులు రుణపడి ఉంటారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.
-ప్రవీణ్గౌడ్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి