సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇందులోభాగంగానే భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు రాయితీపై మొదటి దఫా లక్ష మందికి ద్విచక్ర వాహనాలు ఇవ్వనున్నట్లు సర్కారు ప్రకటించింది.
కార్మిక శాఖ ఆధ్వర్యంలో..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అసంఘటిత రంగంలోని కార్మికుల సామాజిక భద్రత కోసం నిత్యం అవగాహన కల్పిస్తూ.. ఈ-శ్రమ్(e-SHRAM) పోర్టల్లో పేర్లను నమోదు చేసేందుకు కృషి చేస్తున్నది. అసంఘటిత రంగాల్లోని కార్మికులు సీఎస్సీ సెంటర్లతో పాటు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కార్మికశాఖ విభాగాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరు అర్హులు..
గృహనిర్మాణ రంగ కార్మికులు, వలస కూలీలు, ప్లాట్ఫాం, వీధి వ్యాపారులు, గృహ సముదాయాల్లో పనిచేసే వారు, వ్యవసాయ కార్మికులు, నర్సరీలు-ఉద్యానవనాల పనివారు, పాడి పరిశ్రమ, మత్స్యకారులు, తాపీ, సెంట్రింగ్, ప్లంబింగ్, పెయింటర్స్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక-సున్నం బట్టీ, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, క్షౌరవృత్తిదారులు, బ్యూటీ పార్లర్లలో పనిచేసేవారు చర్మకారులు, రజకులు, వీధివ్యాపారులు, చెత్త ఏరేవారు, రిక్షా కార్మికులతోపాటు అన్ని అసంఘటిత రంగాల్లోని కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్కులు అర్హులు.
ప్రయోజనాలు..
అసంఘటిత రంగంలోని ప్రతికార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (UAN) ఇస్తారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందవచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద మరణ/అంగవైకల్య బీమాను ఉచితంగా ఇస్తారు. వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి.. వారికి ఉపాధి కల్పిస్తారు.