సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రుణం తీసుకున్న వారిని వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న చైనా లోన్ యాప్లకు సంబంధించి కాల్సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. చైనాకు చెందిన చెన్ చవోపింగ్ గోల్డెన్ బ్యాగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2020లో బెంగళూర్లో లోన్ యాప్లకు సంబంధించిన కాల్సెంటర్లను నిర్వహించాడు. ఇందులో ఒడిశాకు చెందిన షబ్బీర్ ఆలమ్ సూపర్ వైజర్గా, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఉమాకాంత్ యాదవ్ ఐటీ మేనేజర్గా పనిచేశారు. పలువురికి రుణాలిచ్చి.. వేధింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు లోన్ యాప్లపై కేసులు నమోదు చేయడంతో చెన్ చవోపింగ్ కాల్సెంటర్ మూసేసి.. చైనాకు పరారయ్యాడు.
ఇదిలాఉండగా రేతిబౌలికి చెందిన బాధితురాలు 40 యాప్ల నుంచి రూ. 2 లక్షల రుణం తీసుకుంది. తిరిగి చెల్లించకపోవడంతో ఫోన్ చేసి బెదిరింపులు, అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా మార్ఫింగ్ ఫొటోలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆమె ఫోన్ నంబర్ను 500 మందికి షేర్ చేశారు. బాధితురాలు గతేడాది డిసెంబర్ 20వ తేదీ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, చైనాకు పరారైన చెన్ చవోపింగ్ రెండు నెలల విరామం తీసుకొని షబ్బీర్ ఆలం, ఉమాకాంత్ యాదవ్లతో తిరిగి వివిధ యాప్లను తయారు చేసి.. గూగుల్ స్టోర్స్ ద్వారా మార్కెట్లోకి పంపించాడు. బెంగళూర్ కోరమండల్ ప్రాంతంలో షబ్బీర్, ఉమాకాంత్ల నేతృత్వంలో స్కై లింక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్సెంటర్ను ఏర్పాటు చేయించి, అందులో 100 మంది టెలీకాలర్స్ను నియమించాడు. ఈ కాల్ సెంటర్ నుంచి రుణలు తిరిగి వసూలు చేసేందుకు స్ఫూఫింగ్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ గంగాధర్, వెంకట్రామిరెడ్డి, ఎస్సైలు శాంతారావు, తిరుపతి బృందం బెంగళూర్లోని కాల్సెంటర్పై దాడి చేసి.. నిర్వాహకులిద్దరిని అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. కాల్ సెంటర్ నుంచి 63 ల్యాప్టాప్లు, 19 సెల్ఫోన్లు, స్కై లింక్స్ టెక్నాలజీస్కు చెందిన రెండు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.