సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యం అందిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ హాస్పిటల్లో ఇప్పటికే అన్నిరకాల సూపర్స్పెషాలిటీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు గత ఏడాది స్కిన్ బ్యాంక్, క్యాథల్యాబ్ తదితర వైద్య సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి తోడు ఆపరేషన్ థియేటర్లను కూడా ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే ఏడు థియేటర్లను ఆధునీకరించిన వైద్యాధికారులు త్వరలో మరో కొత్త థియేటర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
75 పడకలతో రెండు నూతన ఐసీయులు..
శస్త్ర చికిత్స తర్వాత రోగులకు ఐసీయూలో చికిత్స అందించాల్సి ఉంటుంది. థియేటర్ల సంఖ్య పెరగడం, ఆధునీకరించడంతో ఇప్పటికే రోజువారీ శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగింది. గతంలో రోజుకు 30 నుంచి 40 వరకు శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 60 నుంచి 100కు చేరింది. ఇందులో మేజర్ సర్జరీలతో పాటు మైనర్ సర్జరీలు సైతం నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్సలకు అనుగుణంగా కొత్తగా మరో రెండు ఐసీయూలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 35పడకల సామర్థ్యం గల ఐసీయూ థియేటర్ను సర్జికల్ విభాగం కోసం, 40 పడకల సామర్థ్యం గల ఐసీయూను మెడికల్ విభాగం కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు. ఈ ఐసీయూలలో అడ్వాన్స్డ్ టెక్నాలజితో కూడిన మానిటర్లు, వెంటిలేటర్లు ఉంటాయని వివరించారు.
లివర్ కేర్ యూనిట్కు మరో ఆపరేషన్ థియేటర్..
ఉస్మానియాలో లివర్ కేర్ యూనిట్కు మంచి గుర్తింపు ఉంది. స్వీయ కాలేయ మార్పిడి వంటి శస్త్ర చికిత్సలతో ఉస్మానియా లివర్ కేర్ యూనిట్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలేయ సంబంధిత శస్త్ర చికిత్సలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సలను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు మరో కొత్త థియేటర్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. నూతన ఐసీయూలతో పాటు సర్జికల్ గ్యాస్ట్రో విభాగం కింద ఆపరేషన్ థియేటర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు
ఉస్మానియాకు వచ్చే రోగుల్లో 90 శాతం మంది నిరుపేదలే. వారికి కార్పొరేట్ తరహా వైద్యసేవలందిస్తూ గవర్నమెంట్ హాస్పిటళ్లపై నమ్మకం పెంచాం. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా రోగులు ఉస్మానియాకు వస్తుంటారు. ఆయుష్మాన్భారత్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి శస్త్ర చికిత్సల కోసం ఇతర రాష్ర్టాల రోగులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సాధారణంగా ఏ రాష్ర్టాల వారికైనా ఇక్కడ పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వైద్య సౌకర్యాలు సైతం పెంచుతున్నాం. రోగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్,ఉస్మానియా హాస్పిటల్